
కిలోమీటర్ ఆధారంగా ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు : ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిలోమీటర్ ఆధారంగా నెలవారీ బస్పాస్లు మంజూరు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న స్లాబ్ విధానాన్ని ఎత్తివేసింది. టోల్ గేట్ చార్జి కూడా బస్పాస్తో పాటే వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు సంస్థ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. ప్రస్తుతం నెలవారీ బస్పాస్ తీసుకున్న వారికి టోల్ ప్లాజా రుసుము ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారని, బస్ పాస్ చూపించి రోజూ టోల్ టికెట్ను తీసుకుంటున్నారని.. తాజాగా ఆ విధానాన్ని సంస్థ ఎత్తివేసిందని ఆయన వివరించారు.
ఇక నుంచి టోల్ చార్జీతో పాటే నెలవారీ బస్పాస్ను ఇస్తామన్నారు. రాష్ర్టంలో నెలవారీ బస్ పాస్ లు 15 వేలు ఉన్నాయని, 100 కిలోమీటర్ల లోపు రెగ్యులర్గా ప్రయాణించే వారికి ‘మంత్లీ సీజన్ టికెట్’ పేరుతో పాస్లను ఇస్తున్నామని తెలిపారు. టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు పాస్లను ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ పాస్ తీసుకుంటే సాధారణ చార్జీతో పోలిస్తే 33 శాతం రాయితీ ఇస్తున్నామని, 20 రోజుల చార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఉదాహరణకు.. ఒకరు 51 కిలోమీటర్లు ప్రయాణిస్తే స్లాబ్ విధానం ద్వారా 55 కిలోమీటర్లకు నెలవారీ బస్పాస్ ఇప్పటి వరకు ఇచ్చామని, ఇకపై 51 కిలోమీటర్లకే బస్పాస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఎండీ వెల్లడించారు.
లక్ష దాటిన రాములోరి తలంబ్రాల బుకింగ్లు
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా లక్ష మందికిపైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారని ఆర్టీసీ వెల్లడించింది. గత ఏడాది 88 వేల మందే బుక్ చేసుకున్నారని తెలిపింది. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు ఈనెల 2 నుంచే రాములోరి తలంబ్రాలు డెలివరీ చేస్తామని పేర్కొంది. తలంబ్రాలను బుకింగ్ చేసుకునే సదుపాయం ఈనెల 10 వరకు పొడిగించినట్లు ఆర్టీసీ తెలిపింది. బస్ భవన్లో సంస్థ ఎండీ సజ్జనార్ కి ఆర్టీసీ లాజిస్టిక్స్ హెడ్ సంతోష్ కుమార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ దంపతులకు కుందన్ బాగ్ లోని ఆయన నివాసంలో ఆర్టీసీ సీపీఎం కృష్ణకాంత్ తలంబ్రాలు అందజేశారు.