హైదరాబాద్,వెలుగు: విద్యార్థి దశలోనే గోల్పెట్టుకొని, దాన్ని చేరేందుకు ప్రయత్నించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మాతృభాషతోపాటు ఇతర భాషల్లో ప్రావీణ్యాన్ని పెంచుకోవాలన్నారు. శనివారం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ, గోవాల్లో కన్నడ మీడియంలో చదివిన విద్యార్థుల అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నడ మీడియంలో 8, 9, పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి.. వారికి అవార్డులు అందజేశారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సజ్జనార్ మాట్లాడుతూ.. ఇంగ్లీషు మీడియం ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉన్న నేటి సమాజంలో కన్నడ మీడియంలో విద్యనభ్యసించి అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. బహుభాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే భవిష్యత్ లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తాను కన్నడ లిటరేచర్ ను ఆప్షనల్ గా ఎంచుకుని సివిల్స్లో విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు.
మాతృభాషలో పోటీ పరీక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. లైఫ్ లో ఉన్నతస్థాయికి ఎదగాలంటే షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడి సాధన చేస్తేనే లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. మంచి పుస్తకాలు చదవాలని, లైబ్రరీకి వెళ్లడం అలవాటు చేసుకోవాలన్నారు.
స్మార్ట్ ఫోన్లలో గంటల కొద్దీ గడపకుండా, వ్యాయామం చేయాలని ఆయన కోరారు. సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే మేలు అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ సంతోష్ హంగల్, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ సి.నంజున్దయ్య, కన్నడిగాస్ వెల్పేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర పుజారి తదితరులు పాల్గొన్నారు.