
మోడీ గెలుపు ప్రభావం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోయింది. ఉన్న లాభాలను పోగొట్టుకున్న రూపాయి గురువారం రూ. 70.02 కి చేరింది. బీజేపీ గెలుపు ఖాయమైన తర్వాత ఇప్పుడు స్థూల ఆర్థిక అంశాలపైనే రూపాయి భవిష్యత్ విలువ ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇందులో దేశీయ, దేశం వెలుపలి అంశాలూ ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ క్రూడ్ ధరలు, చైనా–యూఎస్ వాణిజ్య యుద్ధంతోపాటు త్వరలో ఆర్బీఐ ప్రకటించబోయే మానిటరీ పాలసీలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కదలికలను నిర్దేశిస్తాయని ఎనలిస్టులు వెల్లడించారు. గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూ. 69.45 వద్ద ప్రారంభమైన రూపాయి ఆ తర్వాత మరింత బలపడి ఒక దశలో రూ. 69.37 కి చేరింది. కానీ, ఆ లాభాలను చివరిదాకా నిలబెట్టుకోలేకపోయింది. అంతకు ముందు రోజు ముగింపుతో పోలిస్తే 36 పైసలు నష్టపోయి, చివరకు రూ. 70.02 వద్ద ముగిసింది.