- యుద్ధానికి ముందు క్రూడాయిల్ రేటులో 35 డాలర్లు తక్కువకే
- రూపాయి – రూబుల్ ట్రేడ్కు కొత్త మెకానిజం
- రష్యా మినిస్టర్ 2 రోజుల పర్యటనలో ఓ నిర్ణయం వెలువడే అవకాశం
బిజినెస్ డెస్క్, వెలుగు: ఇండియాకు చాలా చౌకగా క్రూడాయిల్ను అమ్మడానికి రష్యా సిద్ధమయ్యింది. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ కాకముందు ఉన్న రేటులో 35 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తామని కూడా ప్రకటించింది. రష్యా – ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వక ముందు బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 80 – 90 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. ఏడాదికి 15 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను ఇండియా కొనేలా చేయాలని రష్యా చూస్తోంది. మన ప్రభుత్వం కూడా రష్యా క్రూడాయిల్ ఉరల్స్ను కొనడానికి మొగ్గు చూపుతోంది. ఉక్రెయిన్పై దాడి చేయడంతో రష్యాపై యూఎస్, యురోపియన్ యూనియన్, యూకేలు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రష్యా క్రూడాయిల్, గ్యాస్కు డిమాండ్ తగ్గిపోయింది. వీటి రేట్లు పడిపోయాయి. దీన్ని ఆసియా దేశాలు అవకాశంగా చూస్తున్నాయి. చైనా వంటి దేశాలు ఇప్పటికే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొంటున్నాయి. మరోవైపు రష్యా – రూబుల్ పేమెంట్ మెకానిజమ్ను తీసుకొద్దామనే ప్రపోజల్ను రష్యా ప్రభుత్వం ఇండియా ముందు ఉంచింది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గెయ్ లావ్రోవ్ రెండు రోజుల పర్యటనలో దీనిపై ఓ నిర్ణయం వెలువడనుంది.
ఏడాదికి కోటిన్నర బ్యారెళ్లు..
దేశ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రష్యా క్రూడాయిల్ను అమ్మే థర్డ్ పార్టీ కంపెనీల నుంచి ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా క్రూడాయిల్ను కొనే ఆలోచనలో ప్రభుత్వ కంపెనీలు ఉన్నట్టూ తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి, రష్యా ప్రభుత్వ కంపెనీ రోస్నెఫ్ట్ పీజేఎస్సీకి మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదికి కనీసం 1.5 కోట్ల బ్యారెళ్ల రష్యా క్రూడాయిల్ను కొనాలని ఈ ఒప్పందంలో ఉండొచ్చని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు.
రష్యా నుంచి కొత్త రూట్లో..
రష్యా ఆయిల్ను రవాణా చేయడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కొత్త మార్గాన్ని ఇరు దేశాలు పరిశీలిస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. బాల్టిక్ సముద్రం నుంచి క్రూడాయిల్ను సప్లయ్ చేస్తే పశ్చిమ దేశాల నుంచి అడ్డంకులు రావొచ్చు. దీంతో రష్యాకు తూర్పున ఉన్న వ్లాడివోస్టోక్ పోర్టు నుంచి ఇండియా ఈస్ట్ కోస్ట్లోని రిఫైనరీలకు క్రూడాయిల్ను పంపే ఆలోచనలో రష్యా ఉంది. ఈ రూట్లో క్రూడాయిల్ ఇండియాకు చేరడానికి సుమారు 20 రోజులు పట్టొచ్చని అంచనా. రష్యాపై యూఎస్, ఈయూ, జపాన్, యూకే, మరికొన్ని దేశాలు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్గా ఒత్తిళ్లు పెరిగినా, ఇండియా మాత్రం రష్యా చర్యలను పబ్లిక్గా ఖండించలేదు.
కొత్తగా రూపాయి – రూబుల్ ట్రేడ్!
రూపాయి – రూబుల్ ట్రేడ్పై ఫైనాన్స్ మినిస్టర్తో రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గెయ్ లావ్రోవ్ చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రూపాయి – రూబుల్ ట్రేడ్లో ఇరు దేశాల కరెన్సీలను మారకంగా వాడతారు. అంటే రష్యా ఇండియా నుంచి ప్రొడక్ట్లు కొనాలంటే పేమెంట్స్ రూపాయిల్లో చేస్తుంది. డాలర్లలో చేయదు. ఇండియా కూడా అలానే రష్యా కరెన్సీలో పేమెంట్స్ చేస్తుంది. రూపాయి – రూబుల్ ట్రేడ్పై ఎటువంటి రిస్ట్రిక్షన్లు లేవని దేశంలోని రష్యా ఎంబసీ ప్రకటన విడుదల చేసింది కూడా. యూఎస్, ఈయూ, యూకేలు రష్యా బ్యాంక్ స్బెర్ బ్యాంక్పై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యాంక్కు ఇండియాలో కూడా బ్రాంచ్ ఉంది. పశ్చిమ దేశాలు పెట్టిన ఆంక్షల ప్రభావం దేశంలోని కంపెనీలపై, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లపై ఉండదని రష్యా తన ప్రకటనలో పేర్కొంది. రూపాయి – రూబుల్ మెకానిజం త్వరలో ఏర్పాటు కావొచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఏ శక్తివేల్ అన్నారు. ఇటువంటి టైప్ ట్రేడింగ్లో పాల్గొనేలా 4 – 5 ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం అనుమతివ్వొచ్చని చెప్పారు. కాగా కిందటేడాది 3.3 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్లను రష్యాకు ఎగుమతి చేశాం. ఇందులో ఫార్మా ప్రొడక్ట్లు, టీ, కాఫీ ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశం నుంచి 6.9 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్లను దిగుమతి చేసుకున్నాం.