ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ దాడులు
నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు
కీవ్ : ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. గురువారం ఉక్రెయిన్ లోని దక్షిణ ప్రాంతమైన ఒడెసాపై డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది. ఈ అటాక్ లో నలుగురు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. ఒడిసా ప్రాంతంతో పాటు నిప్రో సిటీపైనా ఉదయం ఈ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ అటాక్ లో ఒడెసా, నిప్రో సిటీలో మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ లోని నల్ల సముద్రం ద్వారా ఆహారధాన్యాలు, ఎరువులను ఇతర దేశాలకు రవాణా చేసే ఒప్పందాన్ని మరో 4 నెలలపాటు పొడిగించామని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు.
కీవ్పై ప్రయోగించిన మిసైల్ కూల్చివేత
కీవ్ పై రష్యా ప్రయోగించిన 2 మిసైళ్లను ఉక్రెయిన్ కూల్చివేసింది. గురువారం కీవ్ ప్రాంతంలోని ఇండ్లపై పడుతున్న రష్యా మిసైల్పైకి ఉక్రెయిన్ మరో మిసైల్ను ప్రయోగించి పేల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
పోలెండ్ పై పడింది మా మిసైల్ కాదు
పోలండ్ పై పడింది తమ మిసైల్ కాదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు. తమ మిలటరీ రిపోర్ట్ ఆధారంగా ఆ మిసైల్ రష్యాదే అని ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.