మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి 3 లక్షల మంది అదనపు సైనిక సమీకరణ ఫైల్పై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సంతకం చేయడంతో.. దేశ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మార్షల్ చట్టం అమలుచేసే అవకాశం ఉండటంతో.. చాలామంది దేశాన్ని వీడుతున్నారు. దీంతో 18 నుంచి 65 ఏండ్ల మధ్య ఉన్న పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యన్ ఎయిర్లైన్స్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. యువకులు దేశం విడిచి వెళ్లాలంటే రష్యా రక్షణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. మార్షల్ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పరిపాలన అంతా సైనిక వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోయి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉంటాయని రష్యన్లు భయపడుతున్నారు. ఉక్రెయిన్లో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు పుతిన్ ప్రకటించినప్పటి నుంచి రష్యా - ఐరోపా సమాఖ్య మధ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆకాశన్నంటుతున్న టికెట్ ధరలు
రష్యా నుంచి బుధవారం ఆర్మేనియా, జార్జియా, అజర్బైజాన్తో పాటు కజకిస్తాన్ వెళ్లే ఫ్లైట్స్ టికెట్లన్నీ నిమిషాల్లో అమ్ముడుపోయాయి. ఈ కారణంగా పుతిన్ ప్రభుత్వం, ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి ఖైదీల సాయంకూడా తీసుకుంటున్నట్టు ‘ది గార్డియన్’ తెలిపింది.