ఓల్డేజ్​ పెన్షన్​ ఉంటే  రైతు బీమా కట్

ఓల్డేజ్​ పెన్షన్​ ఉంటే  రైతు బీమా కట్
  • రైతు బీమాకు ‘ఆసరా’ లింక్
  • రెండు స్కీముల్లో ఉన్నవాళ్ల గుర్తింపు
  • జిల్లాల వారీగా లిస్ట్​ పంపిన ప్రభుత్వం
  • ఆధార్ కార్డులు సేకరిస్తున్న ఏఈవోలు 
  • వయోపరిమితి సడలింపుతో టెన్షన్

మంచిర్యాల/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రైతు బీమా పథకానికి రాష్ట్ర సర్కారు ఆసరా స్కీం లింక్​చేస్తోంది. ఈ రెండు స్కీంలలో ఉన్నవాళ్లను గుర్తించి జిల్లాల వారీగా లిస్టులు పంపింది. ఇందులో ఓల్డేజ్​పెన్షన్​పొందుతున్న వాళ్లను రైతు బీమా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు అగ్రికల్చర్​ఆఫీసర్లు గ్రామాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. రెండు స్కీంలలో ఉన్నవారి వయస్సు గురించి ఆరా తీస్తున్నారు. వారం రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేసి అనర్హులను రైతు బీమా నుంచి తొలగిస్తామని చెప్తున్నారు. 
రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది
ఓ వైపు ఆసరా పెన్షన్​ పొందుతూ.. మరోవైపు రైతు బీమాలో ఎన్​రోల్​అయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో 700 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 814 మంది రైతులు ఉండగా, మిగతా జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో వంద, రెండు వందల మంది ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో వెయ్యి నుంచి రెండు వేల మంది కూడా ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఓల్డేజ్​పెన్షనర్లే కాకుండా ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఓల్డేజ్​ పెన్షన్లకు 65 ఏండ్లు, గీత, చేనేత కార్మికులకు 50, ఒంటరి మహిళలు అర్బన్​లో 35, రూరల్​లో 30 సంవత్సరాలు నిండినవాళ్లు పెన్షన్​కు అర్హులు. రైతు బీమాకు 18 నుంచి 59 ఏండ్లలోపు ఉండాలని ప్రభుత్వం రూల్​పెట్టింది. అయితే కొందరు వయస్సు లేకున్నా ఆధార్​లో 65 ఏండ్లుగా నమోదు చేసుకొని ఓల్డేజ్​పెన్షన్​ పొందుతున్నారు. మరికొందరు వయోపరిమితి దాటినప్పటికీ 59 సంవత్సరాలలోపు ఉన్నట్టు ఆధార్​ కార్డులు సృష్టించుకొని రైతు బీమాలో ఎన్​రోల్​ చేసుకున్నారు. వేలాది మంది రెండు స్కీంలలో ఉండడంతో గందరగోళంగా మారింది. 
వయస్సు నిర్ధారణకు తంటాలు  
లబ్ధిదారుల వయస్సు నిర్ధారణ కోసం అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఆధార్, ఓటర్​ఐడీ కార్డులను పరిశీలిస్తున్నారు. కొందరికి ఆధార్​లో 65 ఏండ్లు ఉంటే ఓటర్​ ఐడీ కార్డులో 60 సంవత్సరాలు ఉండగా, మరికొందరికి ఆధార్​లో 55 ఉంటే ఓటర్​ ఐడీ కార్డులో 60 ఏండ్లు ఉన్నాయి. ఈ రెండింటికి పొంతన కుదరకపోవడంతో వయస్సు నిర్ధారణ కోసం ఆఫీసర్లు తంటాలు పడుతున్నారు. భార్యాపిల్లల వయస్సు చూడడంతో పాటు చుట్టుపక్కల వారిని ఆరా తీసి వాస్తవ వయస్సును అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమకు రైతు బీమా అవసరం లేదని, ఆసరా స్కీంలో కొనసాగించాలని కోరుతున్నారు. గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలకు రెండు స్కీంలు వర్తిస్తాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నప్పటికీ వాళ్లు నమ్మడం లేదు. సర్కారు ఏదో వంకతో రైతు బీమా నుంచి తొలగించాలని చూస్తోందని ఆందోళన చెందుతున్నారు. 
ఓల్డేజ్ ​పెన్షన్​కు తగ్గిన ఏజ్​ లిమిట్​
రాష్ర్ట ప్రభుత్వం కిందటి అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ఓల్డేజ్​ పెన్షన్లకు వయోపరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికలు జరిగిన రెండున్నర సంవత్సరాల తర్వాత అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 31 వరకు మీ సేవ సెంటర్ల ద్వారా అప్లికేషన్లు తీసుకుంది. ప్రస్తుతం ఓల్డేజ్​పెన్షన్లకు 57 ఏండ్లు కాగా, రైతు బీమాకు 59 సంవత్సరాలుగా ఏజ్​లిమిట్​ ఉంది. ఇప్పటికే రైతు బీమాలో ఉన్నవాళ్లు సైతం ఇటీవల ఓల్డేజ్​పెన్షన్​కు అప్లై చేసుకున్నారు. వీళ్ల విషయంలో సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. రేపు ఓల్డేజ్​ పెన్షన్​ ఇస్తున్నామని రైతు బీమా నుంచి తొలగిస్తుందేమోనని టెన్షన్​ పడుతున్నారు. 


వయో వృద్ధులంటే ఎవరు?
రాష్ర్టంలో అసలు వయోవృద్ధులంటే ఎవరు? వృద్ధాప్యానికి వయస్సు కొలమానం ఎంత? అన్న విషయంలో ప్రభుత్వానికే స్పష్టత లేకపోవడం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. గతంలో 65 ఏండ్లు పైబడిన వాళ్లకు ఓల్డేజ్​పెన్షన్​ ఇచ్చిన సర్కారు... దానిని 57 సంవత్సరాలకు తగ్గించింది. 59 ఏండ్లలోపు వాళ్లే రైతు బీమాకు అర్హులంటోంది. గతంలో ఉద్యోగుల రిటైర్​మెంట్​ వయస్సు 58 ఏండ్లు ఉంటే... ఇటీవల మరో మూడు సంవత్సరాలు పొడిగించి 61 ఏండ్లకు పెంచింది. దీంతో వృద్ధాప్యానికి మూడు రకాల వయోపరిమితులను విధించినట్లైంది. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందా  అంటూ నెటిజన్లు సోషల్​ మీడియాలో పోస్టింగులు పెడుతూ సర్కారు తీరును విమర్శిస్తున్నారు.


గ్రామాల్లో ఎంక్వైరీ చేస్తున్నం
చాలామంది ఆధార్​ కార్డులో వయస్సు మార్చుకొని ఓల్డేజ్​పెన్షన్​ పొందుతూనే మరోవైపు రైతు బీమాకు ఎన్​రోల్​అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులుంటే రైతు బీమా నుంచి తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆర్డర్స్​ వచ్చాయి. పై నుంచి వచ్చిన లిస్టు ప్రకారం గ్రామాల్లో ఎంక్వైరీ చేస్తున్నాం. 59 ఏండ్లు పైబడిన వాళ్లను రైతు బీమా నుంచి తొలగిస్తాం. గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది లేదు. 57 ఏండ్లకు ఓల్డేజ్​ పెన్షన్​ కోసం అప్లై చేసుకున్నవాళ్ల విషయంలో ఎలాంటి గైడ్​లైన్స్​రాలేదు. 
                                                                                                                                                                                 - వీరయ్య, జిల్లా వ్యవసాయ అధికారి, మంచిర్యాల