ఖానాపూర్‌‌లో బిల్లులు చెల్లించలేదని బడికి తాళం ..పెట్రోల్ పోసుకొని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

ఖానాపూర్‌‌లో బిల్లులు చెల్లించలేదని బడికి తాళం ..పెట్రోల్ పోసుకొని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

ఖానాపూర్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో మన ఊరు, మనబడి పథకం కింద చేపట్టిన పనుల బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ సోమవారం బడికి తాళం వేసి టీచర్లు, విద్యార్థులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. గడ్డం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ రూ.40 లక్షలతో ఖానాపూర్ మండలం రాజురలోని జడ్పీ హైస్కూల్ రిపేర్లు చేపట్టాడు. అయితే ఈ పనుల బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ డబ్బుల కోసం సదరు కాంట్రాక్టర్ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. 

అప్పులు చేసి పనులు చేపట్టానని, కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసిక వేదనకు గురవుతున్నానని వాపోయాడు. ఉదయం స్కూల్​వద్దకు చేరుకొని గేటుకు తాళం వేసి విద్యార్థులు, టీచర్లను లోనికి వెళ్లనీయలేదు. బిల్లులు చెల్లించే వరకు తాళం తీయనని స్పష్టం చేశాడు. చావే శరణ్యమని ఒంటిపై పెట్రోల్ పోసుకొని స్కూల్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

ఆయనకు తోడుగా కొంతమంది గ్రామస్తులు సైతం స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పెంబి పోలీసులు అక్కడి చేరుకొని కాంట్రాక్టర్ తో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. పోలీసులు డీఈవో రామారావుతో మాట్లాడించి నెల రోజుల్లోగా బిల్లులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో బడి తాళం తెరిచాడు.