
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పోగొట్టుకున్న పది మంది బాధితుల నగదును సైబర్ క్రైం పోలీసుల సహాయంతో ఎస్పీ అఖిల్ మహాజన్ రికవరీ చేయించారు. దీంతో బాధితుల అకౌంట్లో వారు పోగొట్టుకున్న అమౌంట్జమ అయ్యింది. దీంతో బాధితులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిసి ఆయనకు కృతజ్క్షతలు తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. గడిచిన నెల రోజుల్లో జిల్లా పోలీసు యంత్రాంగం పది కేసుల్లో కోర్టు ద్వారా బాధితులకు వారు పోగొట్టుకున్న నగదు అందించినట్లు తెలిపారు.
- జైనథ్ మండలానికి చెందిన లింగారెడ్డి గూగుల్ లో ఎస్బీఐ కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్ సెర్చ్ చేశారు. అయితే ఫేక్ నంబర్ రాగా అదే నిజమని భావించి వివరాలు తెలపడంతో అతడి అకౌంట్ నుంచి రూ.2,15,000 మాయమయ్యాయి. వెంటనే సైబర్ క్రైమ్ 1930 సమాచారం అందించగా జైనథ్ పోలీసుల సహాయంతో రూ. 1.30 లక్షలు రికవరీ చేశారు.
- పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన జి.రమేశ్కు ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాట్సాప్ గ్రూపులో డబ్బు ఆశ చూపి సైబర్ నేరగాళ్లు రూ.1,59,000- వసూలు చేశారు. కాగా అందులో నుంచి రూ. 60 వేలను పోలీసులు తిరిగి అందించారు.
- రూ.3 లక్షలు పోగొట్టుకున్న ఉట్నూర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి రూ.50 వేలు కోర్టు ద్వారా తిరిగి అప్పగించారు. మావలకు చెందిన మిథాలీ అనే మహిళ రూ.25 వేలు మోసపోగా ఆ మొత్తాన్ని అందించారు. ఆదిలాబాద్ మండలంలోని యాపాలగూడకు చెందిన నర్సింగ్ రూ.16,901 పోగొట్టుకోగా ఆ మొత్తాన్ని జిల్లా సైబర్ క్రైమ్ బ్యూరో సిబ్బంది రికవరీ చేసి అందజేశారు.