తెహ్రాన్ ఖాళీ చేసి ఉన్నపళంగా వెళ్లిపోండి.. ట్రంప్ కీలక సూచన

తెహ్రాన్ ఖాళీ చేసి ఉన్నపళంగా వెళ్లిపోండి.. ట్రంప్ కీలక సూచన

కెనడా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని కెనడా పర్యటనను ట్రంప్ ముగించుకున్నారు. మంగళవారం రాత్రి వాషింగ్టన్ కు ట్రంప్ చేరుకుంటారు. జీ-7 సదస్సులో పాల్గొనేందుకు సోమవారం రోజు ట్రంప్ కెనడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హతమైతేనే ఈ యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలు చేయడంతో జీ7 పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల దృష్ట్యా తెహ్రాన్ను ఖాళీ చేయాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

తాను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. సంతకం చేయకపోవడం వల్ల ఇరాన్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలను ఉండి ఉండకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అందరూ ఉన్నపళంగా తెహ్రాన్ను ఖాళీ చేయాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ట్రంప్ కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించడంపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేలు మాక్రన్ పాజిటివ్గా స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అనేది ఇప్పుడు ప్రథమ కర్తవ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత ఐదు రోజుల నుంచి భీకర మిస్సైల్స్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ దాడుల్లో మొత్తం 224 మంది ఈ ఐదు రోజుల్లో చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది అమాయక ప్రజలే కావడం గమనార్హం.

ఇరాన్​–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు నాలుగోరోజూ దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది.  సోమవారం ఇజ్రాయెల్​పై ఇరాన్​ మిసైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్​ 370 బాలిస్టిక్​ క్షిపణులు, వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది.  దీంతో టెల్​ అవీవ్, జెరూసలేంలో వార్నింగ్​ సైరన్స్​ ఏకధాటిగా వినిపించాయి. దాదాపు 30 ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్​ చేసిన దాడిలో ఐదురుగు ఇజ్రాయెల్​ పౌరులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఇరాన్​దాడిలో 24 మంది మరణించగా.. 592 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.