అక్కన్నపేట మండలంలో సాదాబైనామా దరఖాస్తులే అధికం

అక్కన్నపేట మండలంలో సాదాబైనామా దరఖాస్తులే అధికం
  • అక్కన్నపేట మండలంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 4183
  • క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ప్రత్యేక బృందాలు

సిద్దిపేట, వెలుగు: భూ భారతి చట్టం అమలులో భాగంగా  ప్రభుత్వం జిల్లాకు ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్​గా ఎంపిక చేసింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేట మండలం పైలెట్ ప్రాజెక్ట్​గా ఎంపికైంది. ఇటీవల పక్షం రోజుల పాటు  మండల  పరిధిలోని 14 గ్రామాల్లో అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహించారు.  మొత్తం 4183 దరఖాస్తులు రాగా వాటిలో సాదా బైనామా 1650, పీవోటీ (ప్రొహిబిషన్​ ఆఫ్​ ట్రాన్స్​ఫర్స్) 700, అసైన్డ్ భూములకు సంబంధించి 413, అప్పీల్ 296 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్ర స్థాయిలో వీటిని పరిశీలించడానికి అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

రైతుల భూ సమస్యలను 25  విభాగాలుగా విభజించి దరఖాస్తులు స్వీకరించగా 3 విభాగాల్లో ఒక్క  దరఖాస్తు రాలేదు. 5 అంశాలకు సంబంధించి రెండేసి దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అక్కన్న పేట మండలంలో అత్యధికంగా 899,  చౌటపల్లిలో అత్యల్పంగా 58 దరఖాస్తులు వచ్చాయి. నందారం గ్రామంలో  మొత్తం 1486 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే 243 సర్వే నెంబర్లలో 932 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన విషయాన్ని రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో ఏండ్లుగా ఈ సమస్యను పరిష్కరించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. 

పరిశీలనకు ప్రత్యేక బృందాలు..

రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిశీలనకు అధికారులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అత్యధికంగా సాదా బైనామా, తగాదాలు, కోర్టు కేసులన్న భూములకు సంబంధించి ఉన్నాయి. అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఇవ్వాలని  దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తున్నారు. సాదా బైనామా దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా గత ప్రభుత్వ హయం నుంచి వీటిని పెండింగ్ లో పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. 

జూన్ 2 నుంచి గ్రామాల్లో..

జూన్ 2 నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అక్కన్నపేట మండలంలో  వివిధ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులే దాదాపు అన్ని గ్రామాల్లో వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం వాటిని ముందుగా పరిష్కరించడానికి కసరత్తు చేస్తున్నారు. అలాగే పెండింగ్ పీవోటీ, మ్యుటేషన్, సర్వే నెంబర్ మిస్సింగ్, పాస్ బుక్ కరెక్షన్స్ వంటి వాటిని ముందుగా పరిష్కరిస్తే దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 

మొత్తం అందిన దరఖాస్తుల సంఖ్య    4183

సాదా బైనామా    1630
పీవోటీ    691
అసైన్డ్ భూములు    413
అప్పీల్    296
శివాయి జమేధార్    246
మిస్సింగ్ సర్వే నెంబర్లు    219
విరాసత్    214
విస్తీర్ణ వివాదాలు    153