
- సెగ్మెంట్లో తొలిసారి గెలిచిన గులాబీ పార్టీ
- గురువారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
- తొలి రౌండ్ నుంచీ కారు ఆధిక్యం
- ఓటమితో కంటతడి పెట్టిన కాంగ్రెస్ క్యాండిడేట్ పద్మావతి
సూర్యాపేట/సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు:
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అంతా అంచనా వేసినట్టుగానే టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. కాంగ్రెస్ క్యాండిడేట్ పద్మావతిపై 43,624 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ గెలవడం ఇదే తొలిసారి. ఇటీవలి అసెంబ్లీ ఎలక్షన్లలో హుజూర్నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ తర్వాత ఎంపీగా ఎన్నికవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో హుజూర్నగర్ సెగ్మెంట్కు ఉప ఎన్నిక వచ్చింది. 21న పోలింగ్ జరగ్గా గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా.. టీడీపీ, బీజేపీ క్యాండిడేట్లు పోటీ ఇవ్వలేకపోయారు.
అన్ని చోట్లా ఆధిక్యం
ఈ నెల 21న జరిగిన పోలింగ్లో నియోజకవర్గవ్యాప్తంగా 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. గురువారం కౌంటింగ్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ తొలి నుంచీ ఆధిక్యంలో నిలిచారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పద్మావతిరెడ్డి ఏ రౌండ్లోనూ ఆధిక్యంలోకి రాలేదు. పదిహేను రౌండ్లు ముగిసేసరికి సైదిరెడ్డి విజయం దాదాపు ఖాయమైపోయింది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా ఐదో రౌండ్కు వచ్చేసరికి 11 వేలకు, పదో రౌండ్కు వచ్చేప్పటికి 20 వేలకు, 15వ రౌండ్లో -29,967 ఓట్ల ఆధిక్యత పెరిగింది. 22వ రౌండ్ ముగిశాక 43,284 ఓట్ల మెజార్టీతో సైదిరెడ్డి గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సెగ్మెంట్లోని అన్ని మండలాల పరిధిలో సైదిరెడ్డికి స్పష్టంగా ఆధిక్యత కనిపించింది.
ఎఫెక్ట్ చూపని ఇతర పార్టీలు
ఉప ఎన్నికలో మొత్తం 28 మంది క్యాండిడేట్లు పోటీ పడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మినహా )) డిపాజిట్లు రాలేదు. బీజేపీ, టీడీపీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ క్యాండిడేట్కు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 1,827 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సపావత్ సుమన్ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. నోటా కు 506 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్గా పోటీ చేసిన మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ కు 894 ఓట్లు వచ్చాయి.
నాలుగు వీవీ ప్యాట్ల లెక్కింపు
ఈవీఎంలు సరిగా పనిచేయలేదని, వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని 11 మంది క్యాండిడేట్లు ఎలక్షన్ అబ్జర్వర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో నాలుగు వీవీ ప్యాట్లను అభ్యర్థులతో ఎంపిక చేయించి, స్లిప్పులను లెక్కించారు. వాటిల్లో స్లిప్పులు, ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్య సమానంగా వచ్చాయి. ఇక సెగ్మెంట్లో 101 సర్వీస్ ఓట్లు ఉండగా 16 మాత్రమే నమోదయ్యాయి. అందులోనూ 13 ఓట్లు నిబంధనల మేరకు లేవని తిరస్కరించారు. మిగతా మూడు ఓట్లు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి.
అసంతృప్తిని దాటుకుని..
కాంగ్రెస్కు కంచుకోట అయిన హుజూర్నగర్లో తొలుత ఆ పార్టీకే మద్దతు కనిపించింది. టీఆర్ఎస్ సర్కారు తీరుపై అసంతృప్తి, ఆర్టీసీ సమ్మె వంటివి కాంగ్రెస్కు సానుకూలంగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ పోలింగ్కు ఒకటి రెండు రోజుల ముందు పరిస్థితిలో మార్పు కనిపించింది. కాంగ్రెస్ కు గట్టి బలమున్న మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతల పాలెం మండలాల్లోనూ కారు గుర్తుకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసలు నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009లో హుజూర్నగర్ సెగ్మెంట్ మనుగడలోకి వచ్చింది. 2009, 2014, 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో సైదిరెడ్డి 7,466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా మంచి మెజారిటీతో గెలిచారు.
భావోద్వేగానికి గురైన పద్మావతి
ఉప ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించిందని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి అన్నారు. కౌంటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను నిలదీయాలనుకున్నామని, బైపోల్లో ప్రజాస్వామ్యం ఓడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము హుజూర్నగర్ సెగ్మెంట్ను ఎంతో అభివృద్ధి చేశామని, ప్రజలంతా తమ వెంటే ఉన్నా.. ఓడిపోవడమేంటని సందేహం వ్యక్తం చేశారు. ఈవీఎంలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు.
హామీలన్ని నిలబెట్టుకుంట: సైదిరెడ్డి
హుజూర్ నగర్లో తనను గెలిపించిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని, తాను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం ఉప ఎన్నికలో గెలుపు తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక హుజూర్నగర్ అభివృద్ధి కోసమే జరిగిందని.. అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గెలవాలని ప్రతి ఒక్కరూ భావించారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు.