
మలేసియా ఓపెన్ పోస్ట్పోన్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్పై భారీ ఆశలు పెట్టుకున్న ఇండియా స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీని పోస్ట్ పోన్ చేశారు. మలేసియాలో కరోనా కేసులు పెరగడంతో.. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వాయిదా నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఈ నెల 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్లో జరగాల్సి ఉంది. వీలైనంత త్వరగా రీషెడ్యూల్ డేట్స్ను ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్ చెబుతున్నా.. ఒలింపిక్ క్వాలిఫయింగ్ విండోలో మాత్రం టోర్నీని నిర్వహించడం సాధ్యమయ్యేలా లేదు. బీడబ్ల్యూఎఫ్ నిర్ణయంతో సైనా, శ్రీకాంత్ ఒలింపిక్ ఆశలకు భారీ గండి పడింది. కాగా, మలేసియా ఓపెన్ పోస్ట్పోన్ కావడంతో.. టోక్యో ఒలింపిక్ క్వాలిఫికేషన్కు సంబంధించిన క్లారిటీ ఇవ్వాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్).. బీడబ్ల్యూఎఫ్ని కోరింది. ‘కీలక క్వాలిఫయర్ పోస్ట్పోన్కావడం నిజంగా దురదృష్టకరమే. సైనా, శ్రీకాంత్తో పాటు మరికొందరు టోక్యో రేస్లో ఉన్నారు. అందుకే షట్లర్ల క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్ సెక్రటరీ థామస్ లుండ్ను కోరాం’ అని బాయ్ పేర్కొంది.