హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ ప్రొఫెసర్లకు, డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లకు వేతనాలు పెరిగాయి. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు యూజీసీ రివైజ్డ్ పే స్కేల్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో రాష్ర్టంలో 2,778 మందికి వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. పెరిగిన వేతనాలు 2016 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త పే స్కేల్ ప్రకారం ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ. 22 వేల వరకు వేతనాలు పెరగనున్నాయి. వర్సిటీ వీసీకి రూ.2.10 లక్షల సాలరీ అందనుంది. ఇంటి అద్దె తగ్గించడంతో పాటు ఏటా మూడు శాతం ఇంక్రిమెంట్స్ అందనున్నాయి. పెరిగిన జీతాల చెల్లింపుతో ప్రభుత్వంపై రూ.260 కోట్లు అదనపు భారం పడనుండగా.. ఇందులో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున భరించనున్నాయి. ఏప్రిల్ 2019 నుంచి జూన్ వరకు పూర్తిస్థాయి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. సవరించిన వేతనాల అమలుతో ఏటా సర్కారుపై రూ.264 కోట్ల భారం పడనుంది. పేస్కేల్ అమల్లోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల లెక్చరర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజీవవయ్య, సురేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త వేతనాల వివరాలు
కేటగిరీ అకడమిక్ లెవల్ పే స్కేల్(రూపాయల్లో)
అసిస్టెంట్ ప్రొఫెసర్ 10 57,700-1,82,400
అసిస్టెంట్ ప్రొఫెసర్ 11 68,900 – 2,05,500
అసిస్టెంట్ ప్రొఫెసర్ 12 79,800 – 2,11,500
అసోసియేట్ ప్రొఫెసర్ 13ఏ 1,31,400 – 2,17,100
ప్రొఫెసర్ 14 1,44,200 – 2,18,200
సీనియర్ ప్రొఫెసర్ 15 1,82,200 -2,24,100