-
సగటు ధరల్లో 10–32 శాతం పెరుగుదల
-
వెల్లడించిన అనరాక్ రిపోర్ట్
న్యూఢిల్లీ: మనదేశంలో టాప్–7 నగరాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇండ్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. సగటు ధరలు 10–-32 శాతం పెరిగాయని రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ అనరాక్ రిపోర్ట్వెల్లడించింది. మార్చి క్వార్టర్లో ఏడు ప్రధాన నగరాల్లోనూ బలమైన డిమాండ్ కనిపించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ , పూణే, బెంగళూరు, హైదరాబాద్లలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై కోల్కతాలో తగ్గాయి. ఈ ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి–-మార్చి క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు 14 శాతం పెరిగి 1,30,170 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్లు అమ్ముడయ్యాయి. రూ. 1.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇండ్లకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో గత దశాబ్దంలో ఈ క్వార్టర్లో అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ ఈ రిపోర్టుపై స్పందిస్తూ వినియోగదారులు, పెట్టుబడిదారుల నుంచి బలమైన డిమాండ్ ఉందన్నారు.
నగరాల వారీగా అమ్మకాలు
ముంబైలో ఇండ్ల అమ్మకాలు మార్చి క్వార్టర్లో 24 శాతం పెరిగి 42,920 యూనిట్లకు చేరాయి. గత ఏడాది మార్చి క్వార్టర్లో 34,690 యూనిట్లు సేల్ అయ్యాయి. పూణెలో ఇండ్ల అమ్మకాలు 15 శాతం పెరిగి 19,920 యూనిట్ల నుంచి 22,990 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్లో అమ్మకాలు 38 శాతం వృద్ధితో 14,280 యూనిట్ల నుంచి 19,660 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 14 శాతం పెరిగి 15,660 యూనిట్ల నుంచి 17,790 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ఢిల్లీ–-ఎన్సీఆర్లో ఇండ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 17,160 యూనిట్ల నుంచి 15,650 యూనిట్లకు పడిపోయాయి. కోల్కతాలో ఇండ్ల అమ్మకాలు కూడా 6,185 యూనిట్ల నుంచి 9 శాతం తగ్గి 5,650 యూనిట్లకు పరిమితమయ్యాయి. చెన్నైలో, రెసిడెన్షియల్ ప్రాపర్టీల సేల్స్ ఈ ఏడాది జనవరి–-మార్చి మధ్య కాలంలో 6 శాతం తగ్గి 5,510 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో 5,880 యూనిట్లు అమ్ముడుపోయాయి.