ఏడాదిలో 26 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈసారి నవంబరులో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించింది. కిందటి ఏడాది నవంబరుతో పోలిస్తే ఈసారి నవంబరులో రిటైల్ అమ్మకాలు 26 శాతం పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) రిపోర్టు ప్రకారం... ఈ ఏడాది నవంబర్లో దాదాపు 23.80 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 నవంబర్ లో 18.93 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. కోవిడ్కు ముందు సంవత్సరం 2019 నవంబర్లో 23.44 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. అన్ని వర్గాల ఆటోమొబైల్స్ నవంబర్లో వృద్ధిని సాధించాయి. టూ-వీలర్లు 24 శాతం, త్రీ-వీలర్లు 80శాతం, ప్యాసింజర్ వెహికల్స్ (పీవీలు) 21 శాతం, ట్రాక్టర్లు 57 శాతం, కమర్షియల్ వెహికల్స్ (సీవీలు) 33 శాతం వృద్ధిని సాధించాయి. "ఈ ఏడాది నవంబర్లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ అత్యధికస్థాయిలో అమ్మకాలను సాధించింది. అయితే 2020 మార్చి సేల్స్ను మినహాయించాలి. అప్పుడు ఇండియా బీఎస్4 నుండి బీఎస్-6 స్టాండర్డ్స్కు మారింది. దీనివల్ల 2020 మార్చిలో రిటైల్ అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి" అని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ సీజన్లో (నవంబర్ 14 నుండి డిసెంబర్ 14 వరకు) పండుగ అమ్మకాలు జోరుగా ఉన్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని సింఘానియా వివరించారు.
అన్నింట్లోనూ రెండంకెల గ్రోత్..
2019 నవంబర్ ప్రీ-కోవిడ్ కాలంతో పోలిస్తే, టూ-వీలర్లు మినహా అన్ని కేటగిరీలలోని మొత్తం రిటైల్ అమ్మకాలు వరుసగా రెండవ నెలలో సానుకూల వృద్ధిని సాధించాయి. “టూవీలర్స్ సెగ్మెంట్ 24 శాతం వార్షిక భారీ వృద్ధిని చూపించింది. కోవిడ్కు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 0.9 శాతం మాత్రమే పడిపోయింది. ఈ సెగ్మెంట్ నెమ్మదిగా ఆటుపోట్ల నుంచి బయటపడుతోంది.
పండుగ సీజన్ అయిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న వివాహాల సీజన్ కారణంగా రిటైల్ విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అన్ని కంపెనీల నుంచి చాలా మోడల్స్ అందుబాటులో ఉండటం మరో కారణం. కొత్త లాంచ్ల సంఖ్య బాగుంది. రూరల్ డిమాండ్ కూడా మా ఇండస్ట్రీకి కలిసి వచ్చింది. కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్యూవీ కేటగిరీ బండ్ల అమ్మకాలకు ఇప్పుడు తిరుగులేదు. ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త మైనింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఫలితంగా డిమాండ్ మరింత పెరుగుతుంది. కంపెనీలు కొన్ని మోడల్స్ ధరలు పెంచినప్పటికీ, ఇన్వెంటరీ ఎక్కువగాఉన్న మోడల్స్కు పెద్ద ఎత్తున డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఈ ఏడాది ముగిసేలోపు అమ్మకాలు ఇంకా పెరుగుతాయి. ఆర్బీఐ రెపోరేట్లు పెంచడం వల్ల వెహికల్ లోన్స్ వడ్డీరేట్లు పెరుగుతాయి. దీనివల్ల ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలపై ఎఫెక్ట్ ఉండొచ్చు. చైనాలో లాక్డౌన్ సమస్యల వల్ల సెమీకండక్టర్ల సరఫరా నెమ్మదించే అవకాశం ఉంది ” అని సింఘానియా చెప్పారు. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి పీవీల సగటు ఇన్వెంటరీ 35–-40 రోజుల వరకు ఉండగా, టూవీలర్ల ఇన్వెంటరీ 30-– 35 రోజుల వరకు ఉంది.