ఎప్పుడూ సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే కండల వీరుడు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. తనకున్న కాస్త సమయాన్ని నేవీ సిబ్బందితో గడిపాడు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ... ఇండియన్ నేవీ సేవలను చాటి చెప్పాడు. భారత నౌకా దళ తూర్పు కమాండోకు ప్రధాన స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో కలిసి సల్మాన్ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. జాతీయ పతాకాన్ని ఊపుతూ.. వారితో వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
అంతే కాదు నేవీ సిబ్బందితో కలిసి సల్మాన్ ఖాన్ కాలు కూడా కదిపాడు. స్టెప్పులు వేస్తూ... వారితో డ్యాన్స్ చేశాడు. అంతటి ఆగకుండా పుష్- అప్ లు చేశాడు. భారత నావికాదళ సిబ్బందితో కలిసి వంట కూడా చేశాడు. నేవీ సిబ్బంది ధరించే టోపీని ధరించి... సల్మాన్ ఎంజాయ్ చేశాడు. కాగా సల్మాన్ ఖాన్ చివరిసారిగా ఆయుష్ శర్మతో కలిసి యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్లో కనిపించాడు. ప్రస్తుతం బాలీవుడ్ కభీ ఈద్ కభీ దీపావళి, కిక్ 2, టైగర్ 3 లతో పాటు.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.