బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ సల్మాన్ ఖాన్కి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ముఖ్యమైన ఈవెంట్స్కే కాదు, తన సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఇక్కడికి వస్తుంటాడు . నవంబర్ 26న రిలీజైన ‘అంతిమ్’ మూవీ ప్రమోషన్స్ కోసం మరోసారి వచ్చాడు. కీలక పాత్రలో నటించిన తన బావమరిది ఆయుష్శర్మ, డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్తో కలిసి నగరంలో సందడి చేశాడు.
ఈ సందర్భంగా ఇలా ముచ్చటించాడు.
‘‘సాధారణంగా సినిమా రిలీజ్కి ముందు వస్తుంటాను. కానీ ‘టైగర్ 3’ షూటింగ్ ఉండటం వల్ల ఈ సినిమా విషయంలో అది కుదరలేదు. అందుకే విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చాక, ఆ ఆనందాన్ని పంచుకోడానికి వచ్చాను. ఇక్కడ కూడా సినిమా బాగా ఆడుతోంది. ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్కి చాలా థ్యాంక్స్. మా ఆయుష్ని కూడా యాక్సెప్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది. మంచి కథ. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించాలంటే ఇలాంటి స్క్రిప్ట్ అవసరం. ‘దబంగ్’లాగే దీన్నీ తెలుగులోకి తీసుకు రావాలనుకున్నాను. కానీ కుదరలేదు. నెక్స్ట్ మూవీ కచ్చితంగా తెలుగులోనూ రిలీజ్ చేస్తాను. ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్లో కొంతమంది ఫ్యాన్స్ టపాసులు కాల్చారు. అలా చేయొద్దని సోషల్ మీడియా ద్వారా కోరాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు టపాసులు కాల్చడం మానేశారు.
క్షీరాభిషేకం కోసం వాడే పాలను పేదలకు పంచిపెడుతున్నారని తెలిసి చాలా ఆనందమేసింది. నేను క్లాస్, మాస్ అని చూడను. మల్టీప్లెక్స్ సినిమాలే చేయాలనుకోను. మంచి సినిమా చేయాలనుకుంటాను. అలా అనుకునే ‘అంతిమ్’ చేశాను. ఇప్పుడు చిరంజీవి గారితో ‘గాడ్ఫాదర్’ సినిమా చేస్తున్నాను. ఆయన, రామ్ చరణ్ నాకు చాలా క్లోజ్. వెంకటేష్ కూడా బాగా తెలుసు. ఆయనతోనూ సినిమా చేయబోతున్నాను. త్వరలోనే వివరాలు చెబుతాను. డిఫరెంట్ కంటెంట్ దొరికితే ఓటీటీలకీ వర్క్ చేస్తాను. ‘దబంగ్ 4’ లైన్లో ఉంది. సాజిద్తో కూడా ఓ మూవీ చేయాల్సి ఉంది.’’