ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. రోగులకు ఉపయోగించే అంబులెన్సులలో రవాణా చేస్తూ పోలీసుల దృష్టిలో కారం కొట్టే ప్రయత్నం చేశారు స్మగ్లర్లు. చెక్ పోస్టుల వద్ద అంబులెన్స్ సైరన్ వేసుకుని, లోపల రోగి ఉన్నాడని చెప్పి వేగంగావెళ్లిపోయే క్రమంలో పోలీసులకు చిక్కారు.
కర్నూలు డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో కడప సబ్ కంట్రోల్ నుంచి ఆర్ఐ చిరంజీవి టీమ్ లోని ఆర్ఎస్ఐ రాఘవేంద్ర బృందం బాలపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రైల్వే కోడూరు రేంజిలోని బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద కనిపించగా... అతను సమాధానం చెప్పక పోవడంతో, అతనిని వెంబడించగగా ఒక అంబులెన్సు కనిపించింది. అంబులెన్సులో ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్నారు. దీంతో వారిని చుట్టుముట్టి స్మగ్లర్లను అరెస్టు చేశారు.
నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన ఏలగిరి అనే మేస్త్రీ ద్వారా కూలీలను సమకూర్చుకుని బెంగుళూరుకు పంపుతున్నారని విచారణలో తేలిందని డీఎస్పీ మురళీధర్ చెప్పారు . అక్కడ నుంచి ప్రసాద్ అనే వ్యక్తి తమిళ కూలీలను తీసుకుని అనంతపురం, గుత్తి మీదుగా తిరుపతి చేరుకుని,అక్కడ నుంచి బాలపల్లి అటవీ ప్రాంతానికి పంపిస్తున్నారు. బాలపల్లిలో దుంగలు తీసుకుని అంబులెన్సులోకి ఎక్కించుకుంటారు. లక్ష్మీనరసయ్య అనే వ్యక్తి అంబులెన్సుకు డ్రైవరుగాను, ప్రసాద్, మహేష్ అనే వ్యక్తులు రోగులుగా నటిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు.
ఈ కేసులో మొత్తం 14మంది ఉండగా, 10మందిని అరెస్టు చేశారు. వారిలో కడపకు చెందిన నిమ్మల ప్రసాద్ (49), లక్ష్మీ నరసయ్య (47), పొద్దుటూరు జి.సతీష్ కుమార్ (37), తమిళనాడు తిరువన్నామలైకు చెందిన మరిదిరి (61), గోవిందన్ (45), కాళి (49), జీ.సేతు (35), కాశి (35), హరి (25), రాజు మాణిక్యం (40)లుగా గుర్తించారు. మరో నలుగురు కోసం గాలించడానికి ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డితో ప్రత్యేక టీమ్ నియమించారు. పట్టుబడిన దుంగలు, వ్యాను కలిపి సుమారు రూ.20లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఈ కేసులో కింగ్ పిన్ ల కోసం గాలిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ శ్రీనివాసులు, ఎఫ్ఆర్ ఓ ప్రేమ పాల్గొన్నారు.