విత్తనాలు వేయాలా.. వద్దా .. వాతావరణ మార్పులతో అయోమయంలో రైతన్నలు

విత్తనాలు వేయాలా.. వద్దా .. వాతావరణ మార్పులతో అయోమయంలో రైతన్నలు
  • అప్పుడే వద్దంటున్న వ్యవసాయ అధికారులు
  • భూమి పూర్తిగా తడిసాకే విత్తనాలు విత్తాలని సూచన

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో వాతావరణ మార్పుల వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. రోహిణి కార్తెలోనే రుతుపవనాలు రావడం, వర్షాలు కురవడంతో రైతులు ఆలస్యం చేయకుండా దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. కానీ ఈ టైంలో విత్తనాలు వేస్తే అంతగా దిగుబడి రాకపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా రైతులు ప్రతీ ఏటా వేసవి చివరలో దుక్కులు దున్ని మృగశిర కార్తెలో వర్షాల కోసం ఎదురుచూస్తారు. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వేసవి చివర్లోనే ముందస్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 107 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో పంటల సాగుపై అధికారులు, రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ముందుగా  రావడంతో ఈ ఏడాది సెప్టెంబర్ కు ముందే తుపాన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

25 రోజుల ముందుగానే..

జిల్లాలో ఖరీఫ్​సీజన్​లో మొత్తం 3,25,713 హెక్టార్లలో వివిధ పంటలు వేసేందుకు వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేసింది. వాస్తవానికి జూన్ లో వర్షాలు మొదలై జులైలో సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఈ నెల 21 నుంచి వాతావరణం చల్లబడి క్రమంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 17 నుంచి 27వరకు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

విత్తనాలు విత్తాలా వద్దా..! 

వర్షాలు కంటిన్యూ​గా కురుస్తుండడంతో రైతులు విత్తనాలు విత్తే పనిలో ఉన్నారు. కానీ మరి కొంతమంది అకాల వర్షాల కారణంగా భూసారంలో తేడా వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం ఇది సరైన టైం కాదంటున్నారు. భూమి పూర్తిస్థాయిలో తడిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని సూచిస్తున్నారు. అప్పుడే నిర్దేశిత మేర పంట దిగుబడులు వస్తాయని చెబుతున్నారు. వేసవిలో దుక్కులు దున్నడంవల్ల భూమిలోని క్రిమి కీటకాలు బయటకు వచ్చి నశించే అవకాశం ఉంటుందంటున్నారు. భూమి పొరలుగా ఏర్పడి మార్పునకు గురవుతుందని సూచిస్తున్నారు. మృగశిరలో కురిసిన వర్షాలకు భూమి బాగా నాని వేసిన విత్తనాలు మొలకెత్తి విత్తనం వేర్లు దెబ్బతినకుండా భూమి లోతుకు వెళ్లే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.