
- ఇంకా రావాల్సింది 5800 టన్నులు
- సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ పంటలకు 38 వేల టన్నులు అవసరం
సంగారెడ్డి, వెలుగు: ఏరువాక తర్వాత జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. సాగు అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు ఎరువులను అందించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రైవేట్ డీలర్లు కృత్రిమంగా యూరియా కొరత సృష్టించే అవకాశం ఉంది. అందుకే ముందస్తు ఏర్పాట్లలో భాగంగా బఫర్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎరువుల కొరత ఏర్పడితే ఈ బఫర్ స్టాక్ నుంచి ఎరువులను విడుదల చేసి సమస్యను పరిష్కరిస్తారు.
సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ అవసరాలకు 38 వేల టన్నుల యూరియా అవసరమవుతుంది.16 వేల టన్నుల డీఏపీ, 36 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని బట్టి ముందు జాగ్రత్తగా కనీసం 15 వేల టన్నుల యూరియాను బఫర్ పాయింట్ లో నిల్వ ఉంచాలి. కానీ ప్రస్తుతం 9,200 టన్నుల స్టాక్ మాత్రమే ఉంది. ఇంకా 5,800 టన్నుల యూరియా రావాల్సి ఉన్నట్టు మార్క్ ఫెడ్ అధికార వర్గాలు తెలిపాయి.
ముందుచూపుతో..
వానాకాలంలో భాగంగా రైతులు జిల్లాలో 2,98,718 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయనున్నారు. ప్రధానంగా పత్తి, వరి, కంది, సోయాబీన్, చెరుకు పంటలు పండిస్తుండగా ఆ తర్వాత మొక్కజొన్న, జొన్న, మినుము, ఇతరత్రా పంటలు పండిస్తారు. ఈ పంటలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం మండలాల వారీగా ఎరువులను సరఫరా చేసే బాధ్యత మార్క్ ఫెడ్ పై ఉంటుంది. బఫర్ స్టాక్ మెయింటెన్ చేయాల్సిన బాధ్యత కూడా మార్క్ ఫెడ్ దే. ఇప్పటికే రైతులు 33 వేల ఎకరాల్లో పత్తి వేశారు. జొన్న, మొక్కజొన్న, పెసర విత్తనాలు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. వరి పంటకు కాస్త టైం ఉన్నప్పటికీ మిగిలిన పంటల సాగు మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా బఫర్ స్టాక్ పాయింట్ లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉంచాలని రైతులు కోరుతున్నారు.
రైల్వే ర్యాక్ పాయింట్ లేక..
జిల్లాలో రైల్వే ర్యాక్ పాయింట్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పక్క జిల్లాల్లో ఉన్న రేక్ పాయింట్ల నుంచి ఎరువులు రవాణా చేసుకునే పరిస్థితి నెలకొంది. సనత్ నగర్ రేక్ పాయింట్ నుంచి జిల్లాకు ఎక్కువగా ఎరువులు సరఫరా అవుతుంటాయి. కొన్నిసార్లు మెదక్, సిద్దిపేట జిల్లా గజ్వేల్, మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాపూర్ ర్యాక్ పాయింట్ల నుంచి సంగారెడ్డి జిల్లాకు ఎరువులు సరఫరా చేస్తున్నారు. ఒకవేళ జిల్లాలో ఎరువుల కొరత ఏర్పడితే అప్పటికప్పుడు వాటిని రవాణా చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. రుతుపవనాలు ముందుగా రావడంతో జిల్లాలో చాలాచోట్ల రైతులు దుక్కులు దున్ని ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పటినుంచే అవసరం మేరకు ఎరువులను నిల్వ ఉంచాలనే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి.
కొరత లేదు..
సాగుకు అనుగుణంగానే ఎరువులను సరఫరా చేస్తాం. జిల్లాకు ఎన్ని టన్నుల ఎరువులు అవసరమో అంత మేరకు స్టాక్ ఉంది. ప్రస్తుతం ఎలాంటి కొరత లేదు. ఇంకా తెప్పిస్తున్నాం. ముందస్తుగా బఫర్ స్టాక్ పాయింట్ లో నిల్వ ఉంచాల్సిన దాని గురించి కూడా ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం.
శ్రీదేవి, డీఎం, మార్క్ ఫెడ్