
- దేవాలయాలకు రెగ్యులర్ ఈవోలు లేక అవస్థలు
- అందరూ ఇన్ చార్జి ఈవోలే
- 36 పోస్టుల్లో 30 ఖాళీయే
సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాలకు ఈవోల కొరత ఏర్పడింది. రెగ్యులర్ ఈవోలు లేక ఇన్ చార్జీలతోనే నడిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 ప్రముఖ దేవాలయాలు ఉండగా ధూప దీప నైవేద్యం పథకం కింద మరో 939 ఆలయాలు ఉన్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి వాటిని 4 కేటగిరీలుగా విభజించారు. వాటికి తగ్గట్టుగా ఈవోల నియామకం లేకపోవడం వల్ల ఒక్కో ఈవో 10 ఆలయాలకు ఇన్ చార్జిగా కొనసాగుతున్నాడు. నిర్వహణ లోపాలు, దూరభారం పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయానికి ఏడాదికి రూ.8 కోట్ల ఆదాయం వస్తుండగా రెగ్యులర్ ఈవో లేకపోవడం గమనార్హం. ఏటా నిర్వహించే జాతరకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి లక్షలాది మంది జనం తరలివస్తారు. అందుకే ప్రతిఏటా నిర్వహించే జాతరలో సౌకర్యాల కొరత కనిపిస్తుంది.
నాలుగు కేటగిరిల్లో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 36 ప్రముఖ ఆలయాలను 4 కేటగిరీలుగా విభజించారు. ఇందులో 6(ఏ) కేటగిరిలో 13, 6(బి)లో 12, 6(సి)లో 10, 6(డి) కేటగిరీలో 1 చొప్పున ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే సంగారెడ్డి జిల్లాలో 6(ఏ) కేటగిరిలో 4, 6(బి)లో 3, 6(సి)లో 5, 6(డి) 1 ఉండగా, మెదక్ జిల్లాలో 6(ఏ) కేటగిరీలో 2, 6(బి)లో 3, 6(సి)లో 2, 6(డి)లో 0, సిద్దిపేట జిల్లాలో6(ఏ) కేటగిరిలో 7, 6(బి)లో 6, 6(సి)లో 3, 6(డి) కేటగిరిలో 0 ఉన్నాయి.
రెగ్యులర్ ఈవోలు లేక ఇబ్బందులు
ఉమ్మడి జిల్లాలో 36 దేవాలయాలకు ఆరుగురు మాత్రమే రెగ్యులర్ ఈవోలు ఉన్నారు. మిగతా 30 ఆలయాలకు ఆ ఆరుగురుకి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయం, రుద్రారం గణేశ్ గడ్డలోని వినాయక టెంపుల్, బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం, బోరంచ నల్లపోచమ్మ టెంపుల్, మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం, తునికి నల్లపోచమ్మ ఆలయం, సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం, కోటిలింగాల గుడి తదితర ఆలయాలు ఉన్నాయి. అదనపు బాధ్యతలు కేటాయించిన దేవాలయాలు దూరంగా ఉండడంతో సమయం వృథా అవుతోంది.
కొన్ని చోట్ల ఆలయాలకు సంబంధించి కోర్టు తగాదాలు ఉండడం వల్ల ఈవోలు పాలన వ్యవహారాలు చూసుకోలేక కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ ఈవోల సమస్య కారణంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్న కొందరు అధికారులు ఆలయాల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ ఈవో పోస్టులను భర్తీ చేసి ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు.