పేర్లే వేరు.. పండుగ మాత్రం ఒక్కటే

పేర్లే  వేరు.. పండుగ మాత్రం ఒక్కటే

దేశం మొత్తం ఘనంగా జరుపుకొనే విశిష్టపండుగ మకర సంక్రాంతి. అయితే వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను ఆచరించే పద్ధతులు మాత్రం భిన్నంగా ఉంటాయి. తమిళనాడులో ‘పొంగల్‌‌’, కేరళలో ‘మకర విళక్కు’.. ఇలా పేర్లు వేరైనా పండుగ కాన్సెప్ట్‌‌‌‌ మాత్రం ఒక్కటే. ఇంటిల్లిపాది బంధుమిత్ర సమేతంగా.. సంతోషంతో పండుగను ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. పంట ఇంటికొచ్చిన వేళ సంతోషంతో చేసుకునే వేడుకలు రకరకాలుగా ఉంటాయి మరి!.

తమిళనాడులో నాలుగు రోజుల పాటు పొంగల్‌‌ ఉత్సవాలు జరుగుతాయి. కొత్త పంట బియ్యంలో బెల్లం, పాలు కలిపి ‘పొంగలి’ వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వృద్ది చెందాలని ఆ సూర్యభగవానుడిని ప్రార్థిస్తారు. భోగి రోజున కొత్త బియ్యంతో పాయసం చేసి, పితృ దేవతలకు నైవేద్యం పెడతారు. మరుసటి రోజు జరిగే ‘సూర్య పొంగల్’ రోజున పశువులను ఆరాధిస్తారు. సంక్రాంతి సందర్భంగా ‘జల్లికట్టు’ నిర్వహించడం తమిళనాడులో సంప్రదాయం.

కర్ణాటకలో కూడా మకర సంక్రాంతిని ఘనంగా జరపుకొంటారు. ముఖ్యంగా ఉడిపి క్షేత్రం కోలాహలంగా ఉంటుంది. మకర సంక్రాంతి ఉత్తరాయణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. సంక్రాంతి రోజున రథాలతో నిర్వహించే శోభాయాత్ర కన్నుల పండుగగా ఉంటుంది. ఊళ్లలో నిర్వహించే ‘కంబాల’ పోటీలు ప్రత్యేకం. నువ్వులు, బెల్లం, కొబ్బరి, శెనగపప్పుతో తయారుచేసి ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు, అలాగే చెరకు గడను కూడా పంచడం ఇక్కడి ఆచారం. ఎల్లుబెల్ల పేరుతో నువ్వులు బెల్లం వంట‌‌కాల‌‌ను తింటారు.

మహారాష్ట్రలో సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ‘తీల్‌‌గూడ్’ పేరిట నువ్వులు, బెల్లంతో హల్వా చేసి బంధుమిత్రులకు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు ‘హల్దీ కుంకుమ్’ పేరుతో పసుపు, కుంకుమలతో పాటు, తాంబూలాలు అందించి వస్తువులను కూడా బహుకరిస్తారు. మకర సంక్రాంతి రోజు ఇక్కడ నల్లరంగు బట్టలు వేసుకుంటారు. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు నువ్వుల లడ్డూలు, భక్ష్యాలు, చెరుకు గడలు దానం ఇస్తారు.

కేరళలో ‘మకర విళక్కు’ రోజున శబరిమలైలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దూరప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తుంటారు. ముగ్గులు వేసి, పూజలు చేస్తారు. బెల్లంతో చేసిన పరమాన్నం వండి పేదలకు పంచిపెడతారు. ఒడిషా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంక్రాంతిని చేస్తారు. గుజరాత్ లో మకర సంక్రాంతి నాడు నువ్వులతో చేసిన మిఠాయిలు పంచిపెడతారు. ఇంటి పెద్దలు, ఇంట్లో చిన్నవాళ్లకు బహుమతులు కానుకలిచ్చే సంప్రదాయం ఇక్కడ ఉంది. గాలిపటాల పోటీలు గుజరాత్‌‌లో చాలా గ్రాండ్‌‌గా నిర్వహిస్తారు.

రాజస్తాన్‌‌లో సంక్రాంతి రోజున ‘ఘెవార్‌‌, తిల్‌‌ప‌‌ట్టీ, ఘ‌‌జ‌‌క్‌‌, ఖీర్, దాల్‌‌ పకోడీ’ స్పెషల్ వంటకాలు చేస్తారు. ఇక్కడ’స‌‌క్రాత్ భోజ్‌‌'(సామూహిక భోజనాలకు) కు ప్రాధాన్యతనిస్తారు. అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన పతంగులు.. వాటి పందాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. పశ్చిమ బెంగాల్లో సంక్రాంతి రోజున ప్రత్యేకంగా ‘గంగా సాగర్’ ఉత్సవం నిర్వహిస్తారు. మకర సంక్రమణ వేళ పుణ్యస్నానాలు చేయడం ఆచారంగా వస్తోంది. పంటలు బాగా పండినందుకుగాను సూర్యదేవునికి కృతజ్ఞతగా వివిధ నగరాల నుండి వేలాది మంది భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటారు.

మరికొన్ని ప్లేస్‌‌ల్లో…

పంజాబ్‌‌లో మకర సంక్రాంతిని పంజాబ్‌‌లో “మాఘీ” అంటారు. ఇక్కడ సంక్రాంతి రోజున గోపాల వ్రతం చేస్తారు. సంక్రాంతికి ముందు “లోహ్రీ” అనే ప్రత్యేక ఉత్సవం జరుపుతారు. తెలుగువాళ్లకి భోగి పండుగ ఎలాగో… పంజాబ్‌‌లో లోహ్రీ అలాగన్నమాట. ఈరోజున ఆరుబయట మంటలు వేసి ఇష్టదైవాలను ఆరాధిస్తూ డాన్సులు చేస్తారు. యూపీలో సంక్రాంతిని “కిచెరి” అనే పేరుతో పిలుస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పవిత్ర గంగానదిలో కర్మస్నానం చేస్తారు. అలహాబాద్‌‌లో మాఘ మేళ వంటి భోగి మంట వేస్తారు. పేదవారికి నువ్వులు, చెరకు, కిచిడి వంటి తినుబండారాలను దానం చేయడం ఆనవాయితీ. మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని ‘సుకరాత్’ పేరుతో జరుపుకుంటారు. గోవులను పూజిస్తూ.. కొత్త పంటలను ఇంటికి తీసుకొని వస్తారు. ఇలా దేశం మొత్తం మీద సంక్రాంతి పండుగ కొత్త కాంతిని నింపుతుంది.