మహారాష్ట్రలోని ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన మేనమామ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో భేటీ అయ్యారు. ఎన్సీపీపై ఇటీవల అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి జులై 2న సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరారు. అదే రోజున ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, మిగిలిన ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా వారందరికి సీఎం ఏక్నాథ్ షిండే శుక్రవారం ( జులై 14) శాఖలు కేటాయించారు
కేబినెట్ విస్తరణ జరిగిన కొద్ది సేపటికే ఆయన శరద్ పవార్ ఇంటికి అజిత్ పవార్ వెళ్లారు. ఆయన్ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి వీరంతా ఆయన్ను కలవడం గమనార్హం.
జులై 2న ఎన్సీపీ నుంచి ఓ గ్రూపుగా చీలిపోయిన అజిత్ పవార్ ఆ తర్వాత బీజేపీ షిండే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. వెంటనే డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణస్వీకారం చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, శరద్ పవార్ అంటే తమకు ఎంతో గౌరవమని.. ఆయనే తమ అధినేత అంటూ అజిత్ వర్గం నేతలు చెబుతూ వచ్చారు. తాజాగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మంత్రులు హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్బల్, అదితి ఠాక్రే, దిలీప్ వాల్సే పాటిల్ తదితరులు శరద్ పవార్ను ఈ రోజు ( జులై 16) సచివాలయం సమీపంలోని వైబీ చవాన్ సెంటర్లో కలవడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్సీపీపై తిరుగుబాటు జెండా ఎగుర వేసి ఏక్ నాథ్ షిండే సర్కార్ లో చేరిన తర్వాత అజిత్ పవార్ శరద్ పవార్ ఇంటిక వెళ్లడం ఇదే తొలిసారి. అజిత్ పవార్ కు ప్రతిభ పవార్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. 2019లో అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయన్ని మళ్లీ ఎన్సీపీలోకి రప్పించడంలో ప్రతిభ పవార్ కీలక పాత్ర పోషించారు. ఆమెను పార్టీ నేతలంతా చిన్నమ్మ అని పిలుస్తూ వుంటారు.