
గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపించాల్సిన బాధ్యత సర్పంచ్, ఉపసర్పంచ్లదే. కానీ వారిద్దరే ఒకరినొకరు కుమ్ములాడుకుంటే ఇక గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ఇటువంటి ఘటనే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజపల్లిలో జరిగింది. పంచాయతీ ఆఫీసులోనే సర్పంచ్, ఉపసర్పంచ్ల మధ్య గొడవ జరిగి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గ్రామంలో చేసిన పనుల చెక్కులపై సంతకమే వారిద్దరి మధ్య వివాదానికి దారితీసింది. మోరీల నిర్మాణంలో.. సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య వివాదం మొదలైంది. ఆ గొడవకు సంబంధించి శుక్రవారం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. కొట్టుకునే వరకు వెళ్లింది. దాంతో అక్కడే ఉన్న ఉపసర్పంచ్ వర్గీయులు... ఒక్కసారిగా సర్పంచ్పై దాడికి దిగారు. ఆ తర్వాత రెండు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఉపసర్పంచ్పై... సర్పంచ్ అనుచరులు తిరిగి దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.