మంచిర్యాల జిల్లా: సర్పంచుకు కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ గ్రామసభ కు హాజరైన ఉదంతం కలకలం రేపింది. శనివారం కోటపల్లి మండలం వెలమపల్లి గ్రామ సభలో చోటు చేసుకున్న ఉదంతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. కరోనా నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ గా తేలినా.. ఒకవేళ పాజిటివ్ గా పరీక్షల్లో తేలకపోయినా.. అనుమానిత లక్షణాలుంటే చాలు క్వారెంటైన్ లో ఉండాలి. జనసమూహానికే కాదు ఇంట్లోనూ అందరికీ దూరంగా కనీసం 14 రోజులు ఉండాలి. దేశంలో నిరక్షరాస్యులకు కూడా ఈ విషయం తెలుసు.
అయితే కోటపల్లి మండలం వెలమపల్లి గ్రామ సర్పంచ్ గోనె సత్యనారాయణ కరోనా నిబంధనలు బేఖాతర్ చేస్తూ.. యధావిధిగా సభకు హాజరై ఏమీ ఎరగనట్టు సభలో పాల్గొన్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటికీ నిర్లక్ష్యంగా ప్రమాదాన్ని సృష్టించే విధంగా సమావేశాలనికి హాజరు కావడం దుమారం రేపింది. గ్రామ ప్రధమ పౌరుడే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇప్పటికి ఈ గ్రామం లో 30 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో స్వయంగా సర్పంచే తనకు కరోనా సోకినా పట్టించుకోకుండా ప్రజలందరికీ అంటిచేవిధంగా వ్యవహరించడం విమర్శలకు గురవుతోంది.