
- ఇంజనీరింగ్, లా కాలేజీలతోపాటు ఎంఫార్మసీ కోర్సు శాంక్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- క్యాంపస్ లో మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ ఆలోచన, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఆర్నెళ్ల వ్యవధిలోనే ఇంజినీరింగ్, లా కాలేజీతోపాటు ఎంఫార్మసీ కోర్సు, ఫార్మసీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీ మళ్లీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండడంతో విద్యార్థి, అధ్యాపక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త కాలేజీలకు కేబినేట్ ఆమోదం
2008లో యూనివర్సిటీ ప్రారంభం సందర్భంగా ప్రవేశపెట్టిన కోర్సులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత పదేళ్లలో వచ్చిన వీసీలు ఒక్క కొత్త కోర్సును ప్రారంభించలేదు. పైగా గతంలో రెగ్యులర్ కోర్సులుగా నిర్వహించిన బాటనీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ డిపార్ట్స్ మెంట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతోపాటు వీసీగా ఉమేశ్ కుమార్ నిరుడు అక్టోబర్ లో బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సహకారంతో యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీని మంజూరయ్యాయి.
తాజాగా హుస్నాబాద్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం కాబోయే ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను బోధించేందుకు 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు, క్యాంపస్ లో ప్రారంభమయ్యే లా కాలేజీకి 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులకు సోమవారం రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. బీటెక్ లో ఒక్కో బ్రాంచ్ లో 60 అడ్మిషన్ల చొప్పున 240 సీట్లు ఇవ్వబోతున్నారు.
లా కాలేజీకి బీసీఐ గుర్తింపు
లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అప్రూవల్ పొందారు. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్ లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్ ఎల్ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు ఇవ్వబోతున్నారు. ఎంఫార్మసీ కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఫార్మసీ కాలేజీలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ కు ఈ నెల 22న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కాలేజీ భూములకు ఆక్రమణల ముప్పు ఉండడంతో రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ నిర్మాణం ప్రారంభించారు.
ఏడాదిలో మరో రెండు కొత్త హాస్టళ్లు
స్టూడెంట్స్ కు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం బాయ్స్, గర్ల్స్కు ఒక్కో హాస్టల్ చొప్పున ఉన్నాయి. గర్ల్స్ 200 మంది, బాయ్స్ 400 మంది ఉంటున్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి కొత్తగా లా కాలేజీ మంజూరు కావడం, వచ్చే అకడమిక్ ఇయర్ లో మరికొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని వీసీ భావిస్తున్న నేపథ్యంలో క్యాంపస్ లో రెండు కొత్త హాస్టళ్ల నిర్మాణానికి సిద్ధమైనట్లు తెలిసింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ మంజూరు చేసిన రూ.15.82 కోట్ల నిధులతో ఈ హాస్టళ్లను నిర్మించబోతున్నారు. గర్ల్స్ హాస్టల్ కు రూ.7.91 కోట్లు, బాయ్స్ హాస్టల్ కు రూ.7.91 కోట్లు ఖర్చు చేయబోతున్నారు.