తక్కువ ఖర్చు.. ఎక్కువ పొదుపు

తక్కువ ఖర్చు.. ఎక్కువ పొదుపు
  • దేశవ్యాప్తంగా షాపర్స్​ కొత్త మంత్రం ఇదే
  • లాక్​డౌన్​ తర్వాత మారనున్న కొనుగోలు తీరు
  • లగ్జరీ కంటే.. నిత్యావసర వస్తువలకే ఇంపార్టెన్స్
  • సినిమాలు.. షికార్లు బంద్.. హెల్త్​కు ప్రయారిటీ
  • నీల్సన్​ తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: లాక్​డౌన్​ ముగిసిన తర్వాత జనం ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. లగ్జరీ వస్తువులు, సినిమాలు, షికార్లకంటే.. నిత్యావసరాలు.. హెల్త్​కే షాపర్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని నీల్సన్​ తాజా సర్వే వెల్లడించింది. తక్కువ ఖర్చు పెట్టాలని, ఎక్కువ పొదుపు చేయాలనేది ఇప్పుడు వారి మంత్రమని పేర్కొంది. షాపింగ్​ మాల్స్, రెస్టారెంట్స్​కు వెళ్లడం మానేసి.. హెల్త్, హైజీన్​ ప్రొడక్ట్స్​పైనే అందరూ ఫోకస్​ చేస్తారని వివరించింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 64 శాతం మంది లాక్​డౌన్​ తర్వాత తాము రెస్టారెంట్లు, మూవీలకు వెళ్లడం తగ్గిస్తామని చెప్పారని తెలిపింది. నిత్యావసర వస్తువులైన బియ్యం, గోధుమలు, సబ్బులు మొదలైన వాటిని కొని పెట్టుకోవడంపై వీరంతా దృష్టిపెడతారంది. దేశంలో కరోనా ఇంపాక్ట్​పై 23 నగరాల్లోని 1,330 మందిపై ఏప్రిల్​ 10 నుంచి ఏప్రిల్​ 14 మధ్య ఈ ఆన్​లైన్​ సర్వే నిర్వహించింది.

నో లగ్జరీ ప్లీజ్..
43 శాతం మంది ఫ్యాషన్​, పర్సనల్​ గ్రూమింగ్, హోం డెకరేషన్​కు పెద్దగా ఖర్చు పెట్టబోమని చెప్పారు. 54 శాతం మంది ఆటోమొబైల్స్​పై ఎక్కువ స్పెండ్​ చేయమని చెప్పారు. కరోనా ఎఫెక్ట్​ ముగిసిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ లేదా షేర్డ్​ ట్రాన్స్​పోర్ట్​ కంటే పర్సనల్​ వెహికల్స్​ను వాడేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారని భావిస్తుండగా జనం ఆలోచన వేరేగా ఉండటం విశేషం. ఆర్థిక అస్థిరతే దీనికి కారణమని నిఫుణులు చెబుతున్నారు. 54 శాతం మంది లగ్జరీ ప్రొడక్ట్స్, అనవసర ప్రయాణాలు పెట్టుకోమని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతకు, సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని దాదాపు 56 శాతం మంది చెప్పారు. హెల్దీ, ఆర్గానిక్​ ఫుడ్, మెడికల్​ నీడ్స్​, ఫిట్​నెస్, మెడికల్​ ఇన్సూరెన్స్​పై ఎక్కువ ఖర్చు చేస్తామన్నారు.

ఇంటి ఫుడ్​కే ఇంపార్టెన్స్
భవిష్యత్​లో బయట ఆహారం తినడంకన్నా ఇంట్లో వండిన ఫుడ్​ తినడానికే జనం ఎక్కువ మొగ్గుచూపుతారని, ఇంట్లోనే ఉండి.. హెల్దీ ఫుడ్​ వండుకోవడానికి ఇష్టపడతారని మ్యారీకో ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్​ మిశ్రా చెప్పారు. ‘‘కస్టమర్ల నమ్మకాన్ని మళ్లీ పొందడానికి బ్రాండ్స్​ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే వారికి కావాల్సిన ప్రొడక్ట్స్​ను తయారు చేయాలి”అని పిజ్జా హట్​ మార్కెటింగ్​ డైరెక్టర్ నేహ చెప్పారు. లాక్​డౌన్​ ఎత్తేసినా.. నార్మల్​ పరిస్థితులు వచ్చినా.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు జనం ఇంట్రెస్​ చూపించకపోవచ్చని, ఎయిర్ లైన్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, మెట్రోలు ఇలా ఏవీ దీనికి మినహాయింపు కాదని నీల్సన్​ గ్లోబల్​ కనెక్ట్ సౌత్​ ఏషియా వెస్ట్ మార్కెట్ లీడర్​ సమీర్​ శుక్లా చెప్పారు. గూడ్స్, సర్వీసులను అందించడంలో హైజీన్​ అనేది బ్రాండ్లకు భవిష్యత్​లో ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందన్నారు.