ప్రజలు తల్చుకుంటే ఏదైనా సాధిస్తారు.. ఎవరినైనా దించుతారు. ఎంత పెద్ద విషయాన్నైనా ప్రజలు నిరసన తెలిపారంటే... ప్రభుత్వాలు తలవంచక తప్పదని ఉత్తరాఖండ్ ప్రజలు నిరూపించారు. జగేశ్వర్ ధామ్ ప్రాంతంలో వెయ్యి దేవదారు చెట్లను నరికివేయడాన్ని ప్రజలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
నిరసనలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఉత్తరాఖండ్ప్రజలు. జగేశ్వర్ ధామ్ ప్రాంతంలోని దేవదారు చెట్లను తొలగించి రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానస్ ఖండ్ మందిర్ మాల మిషన్'లో భాగంగా రోడ్డు విస్తరణ పనులను చేపట్టింది. దేవదారు చెట్ల ఆధ్యాత్మికను బట్టి వాటిని తొలగించేందుకు స్థానికులు ఒప్పుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసనను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది.
అర్టోలా నుండి జగేశ్వర్ వరకు మూడు కిలోమీటర్లు అటవీ మార్గంలో రోడ్డు వేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోడ్డును విస్తరించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న వెయ్యి దేవదారు చెట్లను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ చెట్లను తొలగించడాన్ని స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ నిరసన తీవ్ర రూపం దాల్చడంతో సీఎం పుష్కర్ సింగ్ధామి జోక్యం చేసుకొని... ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకతను మరోసారి పరిశీలించి.. మరల సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎందుకు వ్యతిరేకించారంటే.....
జగేశ్వర్ ప్రాంతంలో దేవదారు చెట్లను పూజిస్తారు. ఈ చెట్లలో దేవతలు ఉన్నారని ప్రజలు నమ్మకం. రోడ్డు కోసం పవిత్రమైన చెట్లను తొలగించడాన్ని స్థానికులు వ్యతిరేకించారు. ఈ చెట్లను దారుక్ వాన్ అని పిలుస్తారు. దేవదారు వృక్షాలను శివ-పార్వతి, గణేశుడు , పాండవుల దైవత్వం వలన ఏర్పడ్డాయని భావిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న చెట్లను తొలగించడాన్ని వ్యతిరేకించారు. 12 జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవ జ్యోతిర్లింగం జగేశ్వర్ ధామ్ లో ఉంది. ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని స్థానికులు చెపుతున్నారు.
భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఎనిమిదవదిగా గౌరవించబడే జగేశ్వర్ ధామ్, లోతైన చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 7వ నుండి 14వ శతాబ్దాల నాటి పురాతన పుణ్యక్షేత్రాల సమూహం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.
అటవీ శాఖ... పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) వారు నిర్వహించిన జాయింట్ సర్వేలో రోడ్డు విస్తరణ అవసరాలను అల్మోరా డివిజనల్ ఫారెస్ట్ అధికారి ధ్రువ్ సింగ్ మార్టోలియా అంచనా వేశారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఈ రోడ్డు విస్తరణ ప్రక్రియను స్థానికులు వ్యతిరేకించడంతో ఆందోళనకు దారితీసింది. ఆందోళన సోషల్ మీడియాలో #SaveJageshwar పేరుతో ప్రచారం జరిగింది. చెట్లను కాపాడాల్సిన ఆవశ్యకతను గురించి ఉత్తరాఖండ్ సద్భావన సమితి(భ) కార్యకర్త భువన్ పాఠక్ ప్రజలకు వివరించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలన్నారు.