
న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్లను సమీకరించే ప్రతిపాదనను ఆమోదించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బోర్డు మంగళవారం తెలిపింది. ఇందులో రూ. 5,000 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్ కూడా ఉంటుంది. పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఈ డబ్బును సేకరిస్తామని ఎస్బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఇటీవల ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా విలేఖరులతో మాట్లాడుతూ, బ్యాంక్ నికర నాన్- పెర్ఫార్మింగ్ అసెట్ రేషియోను ఒక శాతం కంటే తక్కువగా ఉంచుతామని, ప్రస్తుత క్రెడిట్ వృద్ధిని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో ఎస్బీఐ లాభం 74శాతం వార్షికంగా జంప్ చేసి రూ.13,265 కోట్లకు చేరింది. లోన్ లాస్ ప్రొవిజన్లు తగ్గాయి.
2023 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో నిర్వహణ లాభం వార్షికంగా16.82శాతం పెరిగి రూ.21,120 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం 12.83శాతం వార్షికంగా పెరిగి రూ.35,183 కోట్లకు చేరుకుంది. లోన్ బుక్ 20శాతం, డిపాజిట్లు 10శాతం పెరిగాయి. ఎస్బీఐ ఎన్పీఏలు 2023 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 3.91 శాతం నుండి రెండో క్వార్టర్లో 3.52 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 2022 జూన్ క్వార్టర్లో ఒక శాతంగా రికార్డయ్యాయి. ఇవి 2021 సెప్టెంబర్ క్వార్టర్లో 1.52 శాతం నుండి 2022 సెప్టెంబర్ క్వార్టర్లో 0.8 శాతానికి పడిపోయాయి. డిపాజిట్లను ఆకర్షించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 14–16శాతం క్రెడిట్ వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. బ్యాంక్కు రూ.2.5 లక్షల కోట్ల విలువైన టర్మ్ లోన్లు ఉన్నాయని, అన్ని రంగాల నుండి డిమాండ్ను ఆశిస్తున్నామని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.