ముంబై: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెట్కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో లాభం 2.7 శాతం పెరిగి రూ.596.5 కోట్లకు చేరుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.581 కోట్ల లాభం వచ్చింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.2,850.3 కోట్ల నుంచి 32 శాతం పెరిగి రూ.3,762.2 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం రూ.3,016 కోట్ల నుంచి 30 శాతం పెరిగి రూ.3,917కు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.1,266 కోట్ల నుంచి రూ.1,672 కోట్లకు చేరుకుంది. ఫీజులు, కమీషన్ ఆదాయం 25శాతం పెరిగి రూ.1,786 కోట్లకు చేరుకుంది.
చివరి క్వార్టర్లో 13,71,000 కొత్త ఖాతాలు యాడ్ అయ్యాయి. 2022 మార్చి క్వార్టర్లో కార్డుల ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చులు రూ.54,134 కోట్లతో పోలిస్తే, తాజా క్వార్టర్లో 32శాతం పెరిగి రూ.71,686 కోట్లకు చేరుకున్నాయి. అయితే రిసీవబుల్స్ 2022 మార్చి క్వార్టర్లోని రూ.31,281 కోట్ల నుంచి తాజా క్యూ4 లో 30శాతం పెరిగి రూ.40,722 కోట్లకు చేరాయి. గ్రాస్ ఎన్పీఏలు 2.22శాతం నుంచి 2.35శాతానికి పెరిగాయి. నెట్ ఎన్పీఏలు 0.78శాతం నుంచి 0.87శాతానికి చేరాయి.
