
న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ..ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లును తగ్గించింది. పెద్ద డిపాజిట్లకూ కోత వర్తిస్తుందని తెలిపింది. 7–45 రోజుల మధ్య ఎఫ్డీలపై వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. మిగతా కాలపరిమితుల ఎఫ్డీల వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. వచ్చే నెల నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. రూ.రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన ఎఫ్డీలపై ఇది వరకు ఎక్కువ వడ్డీ ఇచ్చారు. ఇక నుంచి వీటికి కూడా సాధారణ డిపాజిట్ల వడ్డీయే చెల్లిస్తారు. ఏడాది–రెండేళ్ల కాలపరిమితి గల బల్క్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మాత్రం మార్చలేదు. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరగడం, వడ్డీరేట్లు తగ్గడంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించడం తెలిసిందే. దీంతో ఐసీఐసీఐ, కోటక్, ఆక్సిస్ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి.