ఇక మిగిలేది జియో, ఎయిర్​టెలేనా?

ఇక మిగిలేది జియో, ఎయిర్​టెలేనా?
  • వొడాఫోన్​‌‌ ఐడియా భవిష్యత్‌‌ ప్రశ్నార్ధకమే…
  • మార్కెట్లో జియో, ఎయిర్‌‌టెల్‌‌ మాత్రమే మిగులుతాయ్‌‌
  • బకాయిల్‌‌ చెల్లింపు పెను భారమే

వెలుగు బిజినెస్‌‌ డెస్క్‌‌: సుప్రీం కోర్టు తాజా తీర్పుతో టెలికం రంగంలో రెండే ప్రైవేటు కంపెనీలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. టెలికం రంగంలో ఇప్పటికే చాలా కాలంగా కొనసాగుతున్న కన్సాలిడేషన్‌‌ మరింత వేగమవుతుందని భావిస్తున్నారు. వొడాఫోన్​‌‌ ఐడియా మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకం కావడంతో, భవిష్యత్‌‌లో  జియో,  ఎయిర్‌‌టెల్‌‌లు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వొడాఫోన్​‌‌ ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్‌‌ ఫీ బకాయిలు ఒకవైపు కొండలా పేరుకుపోవడంతోపాటు, ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్న ఈ కంపెనీ వాటిని చెల్లించడం కష్టసాధ్యమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వొడాఫోన్​‌‌ ఐడియా చెల్లించాల్సిన మొత్తం రూ. 28,359 కోట్లయితే, ఈ కంపెనీ దగ్గర ప్రస్తుతం ఉన్న నగదు నిల్వలు కేవలం రూ. 21,269 కోట్లు మాత్రమే. ఇక వొడాఫోన్​‌‌ ఐడియా మార్కెట్‌‌ క్యాపిటలైజేషన్ చూసిన అంతంత మాత్రంగా రూ. 12,442.42 కోట్లుగానే ఉంది.

వొడాఫోన్​‌‌ ఐడియా గట్టెక్కేనా….

సుప్రీం కోర్టు తీర్పు కనక అమలైతే, ఇండియాలో జియో, ఎయిర్‌‌టెల్‌‌లు పెద్ద ప్లేయర్లుగా కొనసాగుతాయని, వొడాఫోన్​‌‌ ఐడియాకు మనుగడే పెద్ద సవాలవుతుందని ఎస్‌‌బీఐ క్యాప్‌‌ సెక్యూరిటీస్‌‌ రిసెర్చ్‌‌ హెడ్‌‌ రాజీవ్‌‌ శర్మ వెల్లడించారు. వొడాఫోన్​‌‌ ఐడియా అప్పులు ఇప్పటికే రూ. 99,257 కోట్లని, ఇప్పుడు ప్రభుత్వ బకాయిలు చెల్లించడానికి ఆ కంపెనీ ఆపసోపాలు పడకతప్పదని చెప్పారు. బ్యాంక్‌‌ ఆఫ్ అమెరికా–మెరిల్‌‌ లించ్‌‌ కూడా ఇదే అభిప్రాయాన్ని సమర్థిస్తోంది. వొడాఫోన్​‌‌ ఐడియా ప్రభుత్వ బకాయిలు ఎలా చెల్లించగలదనేది ప్రశ్నగానే మిగులుతోందని, సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం ఈ కంపెనీ మీద ప్రతికూలంగా పడుతుందని పేర్కొంది.

ఎయిర్‌‌టెల్‌‌కు కలిసొచ్చిన అదృష్టం…

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎయిర్‌‌ రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్​‌‌ ఐడియా రూ. 28,308.73 కోట్లు లైసెన్స్‌‌ ఫీ బకాయిలు (పెనాల్టీ, వడ్డీ కలిపి) చెల్లించాల్సి ఉంది. మొబైల్‌‌ సర్వీసుల ద్వారా టెల్కోలకు వచ్చిన ఆదాయంలో కొంత శాతాన్ని లైసెన్స్‌‌ ఫీ గా నిర్ణయించారు. ఎయిర్‌‌టెల్‌‌కు ఒక అదృష్టమేమంటే, టెలినార్‌‌ (రూ. 1950.11 కోట్లు), టాటా టెలిసర్వీసెస్‌‌ (రూ. 9,987.04 కోట్లు) భరించాల్సిన అవసరం లేదు.  టెలినార్‌‌ ఇండియా యూనిట్‌‌ను భారతి ఎయిర్‌‌టెల్‌‌ ఇప్పటికే చేజిక్కించుకోగా, టాటా టెలి టేకోవర్‌‌కు డాట్‌‌ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. త్వరలోనే అనుమతి వచ్చే అవకాశాలుఉన్నాయి.

కేటాయింపులు లేవు…

ప్రభుత్వ బకాయిలు చెల్లించేందుకు అవసరమైన కేటాయింపులను అటు ఎయిర్‌‌టెల్‌‌ కాని, ఇటు వొడాఫోన్​‌‌ ఐడియా కాని చేయలేదని, అదనంగా చెల్లించాల్సిన పేమెంట్స్‌‌ ఏవైనా ఆ కంపెనీలపై భారం మోపుతాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌ ఇటీవల ఒక నోట్‌‌లో తెలిపింది. డాట్‌‌కు చెల్లించాల్సిన మొత్తం రూ. 9,800 కోట్లుగా ఎయిర్‌‌టెల్‌‌, రూ. 9,400 కోట్లుగా వొడాఫోన్​‌‌ ఐడియాలు తమ అకౌంట్స్‌‌లో చూపించాయి. తీర్పు నేపథ్యంలో ఎయిర్‌‌టెల్‌‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం పతనమై, చివరకు కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద ముగిశాయి. మరోవైపు వొడాఫోన్​‌‌ ఐడియా షేర్లు గురువారమే ఏకంగా 27 శాతం పడిపోగా, శుక్రవారం కూడా  ఆ షేర్లు మరో 5 శాతం నష్టపోయాయి.

5జీ స్పెక్ట్రం ఆక్షన్‌‌ పైనా ప్రభావం…

భవిష్యత్లో జరగబోయే 5 జీ స్పెక్ట్రం ఆక్షన్‌‌ మీదా సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం పడనుందని మహేష్‌‌ ఉప్పల్‌‌ తెలిపారు.  అప్పులు చేయడానికి టెలికం ఆపరేటర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని చెప్పారు. టెలికం రంగం కుదేలైన సమయంలోనే ఈ తీర్పు రావడం ఇబ్బందికరమైనదేనని అన్నారు. దేశంలోని టెలికం రంగం మొత్తం రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. పోటీదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లాభపడే వీలు రిలయన్స్‌‌ జియోకు చిక్కుతుందని బ్యాంక్‌‌ ఆఫ్‌‌ అమెరికా–మెరిల్‌‌ లించ్‌‌ అభిప్రాయపడుతోంది. బకాయిల చెల్లింపు ప్రభావం ప్రత్యర్ధుల మీద తీవ్రంగా పడితే, 5జీ లో జియో లాభపడే అవకాశం ఉందని తెలిపింది. ఐతే, టెలికం కంపెనీలకు ప్రభుత్వం కొంత ఊరట ఇచ్చే అవకాశమూ లేకపోలేదని మరి కొంత మంది నిపుణులు చెబుతున్నారు. బకాయిల చెల్లింపుపై రెండేళ్ల వెసులుబాటు కల్పించొచ్చని అంటున్నారు. వెసులుబాటు ప్రకటిస్తే, ముగ్గురు ప్లేయర్లు కొనసాగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లని, లేకపోతే మాత్రం మార్కెట్లో ఇద్దరు ప్లేయర్లే మిగులుతారని ఎస్‌‌బీఐ క్యాప్‌‌  శర్మ అభిప్రాయపడుతున్నారు.