ముంబై: పింక్ వాట్సాప్ పేరుతో స్కామర్లు, హ్యాకర్లు జనాన్ని మోసం చేస్తున్నట్టు వెల్లడయింది. ‘పింక్ వాట్సాప్’ అనే కొత్త మెసేజింగ్ యాప్లో చాలా ఫీచర్లు ఉంటాయని, దీనిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. చాలా మందికి ఇలాంటి మెసేజ్లు వచ్చాయి. ఇటీవల, ముంబై పోలీసులు 'పింక్ వాట్సాప్' మెసేజ్కు సంబంధించి పబ్లిక్ అడ్వైజరీని విడుదల చేశారు. ఈ లింక్పై క్లిక్ చేయవద్దని, పింక్ వాట్సాప్ అనేది నకిలీ యాప్అని హెచ్చరించారు. లింక్పై క్లిక్ చేయడం లేదా సంబంధిత అప్లికేషన్ను డౌన్లోడ్ చేయకూడదని స్పష్టం చేశారు. ‘‘పింక్ వాట్సాప్కు సంబంధించిన వార్తలు ఇటీవల వాట్సాప్లో హల్చల్ చేస్తున్నాయి. ఇది హానికరమైన సాఫ్ట్వేర్.
దీని ద్వారా మీ మొబైల్ను హ్యాకింగ్ చేయడానికి నేరగాళ్లు ప్రయత్నిస్తారు. ఇది కచ్చితంగా సైబర్ మోసమే! అమాయక జనం ట్రాప్లో పడేలా సైబర్ నేరగాళ్లు వివిధ రకాల కొత్త మార్గాలను వాడుతున్నారు. వినియోగదారులు ఈ రకమైన మోసాల పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ ప్రపంచంలో సెక్యూరిటీ చాలా ముఖ్యం" అని ముంబై పోలీసులు పేర్కొన్నారు. మోసగాళ్లు పంపినది ఫిషింగ్ లింక్ అని, దీనిపై క్లిక్చేస్తే మొబైల్ ఫోన్ డేటా లీకయ్యే ప్రమాదం ఉందని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సంబంధిత మొబైల్ను మోసగాళ్లు దూరం నుంచే కంట్రోల్ చేయవచ్చు. కాంటాక్ట్ నంబర్స్, సేవ్ చేసిన చిత్రాలకు అనధికారిక యాక్సెస్ పొందవచ్చు. ఆర్థిక నష్టాలు, ఐడీ కార్డుల దుర్వినియోగం, స్పామ్ దాడులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పింక్ వాట్సాప్ స్కామ్ నుండి సురక్షితంగా ఉండటానికి, వాట్సాప్ వినియోగదారుల కోసం పోలీసులు అందించిన గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి.
- మీరు నకిలీ యాప్ను డౌన్లోడ్ చేసుకునే ఉంటే ఫోన్లో ‘ సెట్టింగ్లు > యాప్లు > వాట్సాప్’ (పింక్ లోగో)కి వెళ్లి అన్ఇన్స్టాల్ చేయాలి.
- లింకుల గురించి మీకు పూర్తిగా తెలిస్తే తప్ప వాటి జోలికి వెళ్లకూడదు. గుర్తు తెలియని సోర్సుల నుంచి వచ్చిన లింక్లపై క్లిక్ చేయకూడదని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
- అధికారిక గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ లేదా చట్టబద్ధమైన వెబ్సైట్ల నుంచి మాత్రమే యాప్లను ఇన్స్టాల్ చేయండి లేదా అప్డేట్ చేయండి.
- సరైన అథంటికేషన్ లేదా వెరిఫికేషన్ లేకుండా ఇతరులకు ఏదైనా లింక్లు లేదా సందేశాలను ఫార్వర్డ్ చేయకండి.
- లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు వంటి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్లైన్లో ఎవ్వరికీ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.
- మోసం ప్రయత్నాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తాజా వార్తలను, అప్డేట్లను తెలుసుకోవాలి. ఫలితంగా సైబర్క్రిమినల్ కార్యకలాపాల గురించి సమాచారం వస్తుంది.
ఇలా కూడా మోసం చేస్తున్నరు
స్టాక్ బ్రోకరింగ్ప్లాట్ఫారమ్ జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ ఇటీవల ఓ మోసం గురించి ట్విట్టర్ ద్వారా వివరించారు. ఈ స్కామ్ ఎలా చేస్తారంటే.. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ సంస్థల నుంచి వస్తువులను ఆర్డర్ చేసిన వారిని టార్గెట్ చేస్తారు. తాము పోలీసులమని చెప్పుకుంటూ కస్టమర్కు ఒక లెటర్పంపిస్తారు. మీకు పంపిన పార్సిల్లో డ్రగ్స్ దొరికాయని, దీనిపై దర్యాప్తు మొదలయిందని చెబుతారు. మీరు మనీ లాండరింగ్ చేస్తున్నారని బెదిరిస్తారు. విచారణ మొదలయిందని, వెంటనే రూ.22,525 లను తాము ఇచ్చిన బ్యాంకు అకౌంట్కు డబ్బులు పంపించాలని సూచిస్తారు. విచారణ పూర్తయిన వెంటనే డబ్బులు వాపసు వస్తాయని నమ్మిస్తారు. ఇది మోసమని, దీని బారినపడకూడదని కామత్ హెచ్చరించారు.