న్యూఢిల్లీ: డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఓ మల్టీనేషనల్ కంపెనీ నుంచి రూ.207 కోట్లు కొట్టేశారు. ఆ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖాన్నే డీప్ ఫేక్ చేశారు. ఆపై వీడియో కాల్ చేసి ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలంటూ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులను ఆదేశించారు. దీంతో సిబ్బంది ఆయన చెప్పిన అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు. పక్కా ప్లాన్ చేసిన నేరగాళ్లు, వారం రోజుల్లో ఈ దోపిడీ ఎపిసోడ్ను ముగించారు. ఆపై తేరుకున్న కంపెనీ సిబ్బంది, తాము మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అతిపెద్ద డీప్ ఫేక్ మోసం కంపెనీకి చెందిన హాంకాంగ్ బ్రాంచ్లో ఇటీవలే జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది.
వీడియో కాల్ చేసి నమ్మించారు..
స్కామర్లు పక్కాగా స్కెచ్ వేశారు. కంపెనీకి చెందిన మెయిన్ బ్రాంచ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్తో పాటు, కీలక సిబ్బంది ముఖాలను డీప్ ఫేక్ చేశారు. వాళ్ల మాట తీరును మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. ఆపై క్యాష్ వ్యవహారాలు చూసుకునే హాంకాంగ్ బ్రాంచ్లోని అకౌంటెంట్కు వీడియో కాన్ఫరెన్స్ కలిపారు. అంతకుముందే, సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా అతడిని అలర్ట్ చేశారు.
గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడుతున్న బాస్తో సహా మిగతా టీమ్ అంతా తమ కంపెనీవాళ్లే కావడంతో అకౌంటెంట్కు ఏమాత్రం అనుమానం రాలేదు. వీడియోకాల్లో వాళ్లు చెప్పినట్లే ఐదు అకౌంట్లకు రూ.207 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. కంపెనీ హెడ్డాఫీస్కు వెళ్లగా తనను మోసం చేశారని తేరుకుని పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆ కంపెనీ పేరేంటో కూడా వెల్లడించని పోలీసులు.. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ పట్టుకోలేకపోయారని మీడియా రిపోర్టు పేర్కొంది.