- కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, కాల్ డేటా
- ఈ వారంలోనే అనుమానితుల విచారణ
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దేశవ్యాప్తంగా 7 టీమ్స్తో సిట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే ఫిల్మ్ నగర్లోని నందకుమార్కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్, షేక్పేట్, చైతన్యపురిలోని ఇండ్లలో సోదాలు చేసింది. కేసులో ప్రధాన నిందితుడైన రామచంద్ర భారతికి చెందిన హర్యానాలోని ఫరీదాబాద్, ఆయన ఎక్కువగా తిరిగే కేరళలో ఆదివారం కూడా సోదాలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ సన్నిహితులు, ఫ్రెండ్స్ నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. దీంతో పాటు ఏపీలోని తిరుపతిలో సింహయాజికి చెందిన ప్రాంతాల్లో పలువురిని విచారించినట్లు సమాచారం. సోదాల వివరాలను సిట్ అధికారులు వెల్లడించడం లేదు.
లీగల్ ఒపీనియన్తో..
ఇప్పటికే సేకరించిన ఆధారాలతో సంబంధిత వ్యక్తులను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా సీనియర్ లాయర్ల సలహాలు తీసుకుంటున్నారు. నిందితులు ప్రస్తావించిన వ్యక్తులకు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఏ సెక్షన్స్ కింద నోటీసులు ఇవ్వాలనే వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ కేసులో వారికి నేరుగా సంబంధం ఉంటే నిందితులకు జారీ చేసిన విధానంగానే సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కుట్ర జరిగిందనే కారణంగా, రామచంద్ర భారతిపైనే సిట్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఫామ్ హౌస్లో సేకరించిన వీడియో ఫుటేజ్, ఆడియో కాల్ రికార్డులకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మరో రెండ్రోజుల్లో ఏసీబీ కోర్టుకు అందనుంది. రిపోర్ట్ మొత్తం సీల్డ్ కవర్లో సిట్కు అందజేసే అవకాశాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో పేర్కొన్న వివరాలు, ఆడియో కాల్స్లో రికార్డ్ అయిన నంబర్ల వారిగా సంబంధిత వ్యక్తులను వివరణ కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఈ వారం రోజుల్లోనే అనుమాతులను విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
తుషార్ లింక్స్ కోసం కేరళలో..
కర్నాటక పుత్తూరులోని రామచంద్ర భారతి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ జాయింట్ డైరెక్టర్ జగ్గును కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. ఇవే హాస్పిటల్ ఫరీదాబాద్లో ఉండడంతో జగ్గు అక్కడికి వెళ్లేవాడని తెలిసింది. ఈ క్రమంలోనే జగ్గు ద్వారా తుషార్, రామచంద్ర భారతిల మధ్య పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఫామ్ హౌస్ డిస్కషన్స్, ఫోన్ కాల్స్లో రామచంద్ర భారతి తుషార్ పేరును ప్రస్తావించడంతో స్థానికంగా వివరాలు సేకరిస్తున్నారు.