
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై సెబీ తన విచారణను పూర్తి చేసింది. అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణలపై విచారణ ముగిసిందని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. తన నివేదికలోని వివరాలను మాత్రం వెల్లడించలేదు. తమ పరిశోధనల ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని మాత్రమే పేర్కొంది. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన 24 లావాదేవీలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. వీటిలో 22 లావాదేవీలపై విచారణ తుదిదశకు చేరింది. మిగతా రెండింటి గురించి కొన్ని ఏజెన్సీల నుంచి సమాచారం రావాల్సి ఉందని పేర్కొంది. విచారణ సమయంలో సెబీ తీసుకున్న చర్యలను కోర్టు ఫైలింగ్ వివరించింది.
కొన్ని రిలేటెడ్ పార్టీ లావాదేవీలపై చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. ఈ కేసును ఆగస్టు 29న సుప్రీంకోర్టు విచారించనుంది. రిలేటెడ్ -పార్టీ లావాదేవీల నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో 13 అదానీ గ్రూప్ డీలింగ్లను సెబీ పరిశీలించినట్లు తెలిసింది. కొన్ని ఆఫ్షోర్ డీల్స్పైనా విచారణ జరిపినట్టు సమాచారం. అదానీ గ్రూప్ కంపెనీల పబ్లిక్ షేర్హోల్డర్లుగా ఉన్న 12 మంది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లను కవర్ చేసినట్లు రెగ్యులేటర్ తెలిపింది. అయితే ఈ సంస్థలలో కొన్ని ట్యాక్స్హెవెన్స్గా పిలిచే దేశాల పరిధిలో ఉన్నాయి. ఈ అంశంపై ఐదు దేశాల నుంచి సమాచారం కోరినట్లు సెబీ తెలిపింది.