
4 ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ కంపెనీ సైయంట్ డీఎల్ఎం, హెల్త్విస్టా, జాగిల్, రాశి పెరిఫెరల్స్
న్యూఢిల్లీ : సైయంట్డీఎల్ఎం, రాశి పెరిఫెరల్స్, హెల్త్ విస్తా, జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 2022–జనవరి 2023 మధ్య కాలంలో ఈ కంపెనీలు ఐపీఓల కోసం పేపర్లు ఫైల్ చేసుకున్నాయి. ఐటీ సొల్యూషన్స్ కంపెనీ రాశి పెరిఫెరల్స్ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 750 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఈ డబ్బులో రూ. 400 కోట్లు అప్పులు తీర్చడానికి, రూ. 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కోసం వాడుకోవాలనేది రాశి పెరిఫెరల్స్ ప్లాన్. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ రంగంలోని హైదరాబాద్ కంపెనీ సైయంట్ డీఎల్ఎం తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 740 కోట్లు సేకరించాలని ఆలోచిస్తోంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ లేదు.
క్యాపెక్స్, ఎక్విజిషన్లు, అప్పులు తీర్చడానికి ఈ నిధులు వెచ్చించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. పోర్టియా బ్రాండ్ పేరుతో అవుటాఫ్ హాస్పిటల్ హెల్త్కేర్ అందిస్తున్న హెల్త్విస్టా ఇండియా కూడా రూ. 200 కోట్ల సమీకరణ కోసం తాజా షేర్లను జారీ చేయాలనుకుంటోంది. దీంతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లలో కొంత మంది 5.62 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంచనున్నారు. ఈ కంపెనీ ఐపీఓ విలువ రూ. 1,000 కోట్ల దాకా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఓ ఫండ్స్ను సబ్సిడరీ కంపెనీ మెడిబిజ్ పార్మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీ వాడాలనుకుంటోంది.