న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్స్ రెగ్యులేషన్స్ను అతిక్రమించినందుకు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్కి సెబీ భారీ షాక్ ఇచ్చింది. ఇంకో రెండేళ్ల వరకు కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది. ఈ బ్రోకరేజికి వ్యతిరేకంగా రెండు కేసుల్లో దర్యాప్తు జరపగా, కంపెనీ ఆఫీసులను సెబీ ఆరుసార్లు తనిఖీ చేసిందని రెగ్యులేటరీ హోల్టైమ్ మెంబర్ ఎస్కే మహంతి ఆర్డర్లో పేర్కొన్నారు. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్పై దర్యాప్తును 2014 నుంచి సెబీ జరుపుతోంది. రెగ్యులేషన్స్ను ఫాలో అవుతుందో లేదో చెక్ చేయడానికి అప్పుడు కంపెనీ అకౌంట్ బుక్స్ను పరిశీలించింది.
తనిఖీ టైమ్లో ఐఐఎఫ్ఎల్ తన సొంత ఫండ్స్ను, క్లయింట్స్ ఫండ్స్ను వేరు చేసి చూపలేదని, క్లయింట్స్ ఫండ్స్లోని క్రెడిట్ బ్యాలెన్స్ను తప్పుగా వాడిందని సెబీ గుర్తించింది. ఆ తర్వాత కూడా వరుసగా తనిఖీలు నిర్వహించింది. క్లయింట్ల బ్యాంక్ అకౌంట్స్, క్లయింట్ల డివిడెండ్ అకౌంట్ల నుంచి ఫండ్స్ తరచూ కంపెనీ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయని గుర్తించింది. దీంతో క్లయింట్ల ఫండ్స్ను తప్పుగా వాడారా? లేదా? అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని తాజాగా మహంతి పేర్కొన్నారు. గత కొన్నేళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్న సెబీ, తాజాగా ఈ కంపెనీని దోషిగా ప్రకటించింది. 2017, 2021 లో సెబీ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది కూడా.