న్యూఢిల్లీ: దేశంలో సోమవారం మంకీపాక్స్ రెండోకేసు వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి (31) కి మంకీపాక్స్ పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. కన్నూర్కు చెందిన ఇతను ఈ నెల 13న దుబాయ్ నుంచి మంగళూరు ఎయిర్ పోర్టులో దిగాడని వారు తెలిపారు. ‘‘ఆ వ్యక్తిలో మంకీపాక్స్ సింప్టమ్స్ను గుర్తించిన వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అతని సాంపుల్స్ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) కి పంపాం. ఆ సాంపుల్స్ను పరీక్షించగా మంకీపాక్స్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం పేషెంట్ కన్నూర్లోని పరియరమ్ మెడికల్కాలేజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని పరిస్థితి స్టేబుల్గా ఉంది” అని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరపాలని అన్ని ఎయిర్పోర్ట్, పోర్ట్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కిందటి వారం యూఏఈ నుంచి కేరళకు తిరిగివచ్చిన వ్యక్తికి కూడా మంకీపాక్స్ పాజిటివ్గా తేలింది. ఆ టైమ్లో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) నుంచి నిపుణులను కేరళకు పంపింది. వెస్ట్, సెంట్రల్ ఆఫ్రికాలో మే నెలలో మంకీపాక్స్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇది అక్కడ ఎండెమిక్ గా ఉంది.