- రిమ్స్కు మరో 31 మంది తరలింపు
- ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
- ఎస్ఓ, వంట సిబ్బందిని
- సస్పెండ్ చేసిన డీఈఓ
నేరడిగొండ, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని కేజీబీవీ స్కూల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికాగా 11 మందిని రిమ్స్కు తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి భోజనం చేసిన 25 మంది కూడా వాంతులు, విరేచనాలతో బాధపడగా వీరిని కూడా రిమ్స్కే తరలించారు. సోమవారం ఉదయం టిఫిన్ చేశాక మరో ఆరుగురి పరిస్థితి బాగా లేకపోవడంతో రిమ్స్లో అడ్మిట్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ లీడర్లు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. డీఈఓ ప్రణీత పాఠశాలకు చేరుకుని ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఈఓ, ఎస్ఓ సమక్షంలో సిబ్బంది వంట చేయగా బియ్యం, పప్పులో పురుగులు కనిపించాయి. దీంతో మరోసారి స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా, సెక్టోరియల్ ఆఫీసర్ జయశ్రీని, ఐదుగురు వంట మనుషులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. ఇచ్చోడ సీఐ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. హాస్టల్ కి అధికారులు మూడు రోజులు సెలవు ప్రకటించారు.
సుల్తాన్పూర్ జేఎన్టీయూలో..
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ క్యాంటీన్ మెస్ లో సోమవారం రాత్రి భోజనం చేసిన పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా నాణ్యతలేని భోజనం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్ , కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్ ను తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.