
సికింద్రాబాద్, వెలుగు: రూ.720 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్టేషన్ ఐదో ఎగ్జిట్ గేట్, పార్శిల్ ఆఫీసు సమీపంలో తాత్కాలిక బుకింగ్ కౌంటర్ నిర్మించారు. ప్రయాణికుల టికెటింగ్, విచారణ కార్యకలాపాలకు వీలు కల్పించారు. స్టేషన్ ఉత్తరం వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్, దక్షిణం వైపు, కొత్త స్టేషన్ భవనానికి పునాది పనులు ప్రారంభించారు. మొత్తం స్టేషన్లో నీటి అవసరాలు తీర్చడానికి మూడు భూగర్భ ట్యాంకులు నిర్మిస్తున్నారు.
1.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక ట్యాంక్ రిజర్వేషన్ ఆఫీసు వద్ద , 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండో ట్యాంక్ ట్రైన్, లైటింగ్ డిపో ఏరియా వద్ద, మూడో ట్యాంక్ ప్లాట్ఫాం 10 సమీపంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన 90 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి. ఈ ట్యాంకుల నిర్మాణం పూర్తయితే స్టేషన్లో నీటి కొరత తీరుతుంది. ఇప్పుడున్న స్టేషన్ భవనానికి ఉత్తరం వైపున ఒక 11 కేవీ సబ్-స్టేషన్ ఉంది. దీన్ని స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 33 కేవీ సబ్-స్టేషన్గా పునరాభివృద్ధి చేస్తున్నారు.
ఆటంకం కలగకుండా పనులు
రైలు ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలి. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్ణీత ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన లక్ష్యాల మేరకు నిర్మాణాలు చేపడుతున్నాం. – దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, శ్రీ అరుణ్ కుమార్ జైన్