ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అధికారపార్టీ ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నిజానికి మిజోరంలోనూ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ చత్తీస్గఢ్లతోపాటే కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఆదివారం చర్చ్లకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సోమవారం ఓట్లను లెక్కించాలంటూ పార్టీలు, ఎన్జీఓలు, స్టూడెంట్ యూనిట్లు చేసిన రిక్వెస్టుకు ఎలక్షన్కమిషన్ అంగీకరించింది. ఉదయం ఎనిమిదింటికి 13 సెంటర్లలో లెక్కింపు మొదలవుతుందని రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లయన్ జెలా చెప్పారు. 40 నియోజకవర్గాల కోసం ఒక్కో కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేశామని అన్నారు.
మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తామని, తరువాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ ఉంటుందని వివరించారు. కొన్ని సీట్లలో తక్కువ మంది ఓటర్లు ఉన్నందున రెండు రౌండ్లలోనే ఓటింగ్ పూర్తవుతుందని అన్నారు. కౌంటింగ్ కోసం నాలుగు వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గత నెల ఏడో తేదీన జరిగింది. మొత్తం 174 మంది పోటీపడగా, వీరిలో 18 మంది మహిళా క్యాండిడేట్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 8.57 లక్షలు. ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 13 స్థానాలకు పరిమితమయింది.