రెండు కుక్కల కొట్లాట యజమానులు గొడవ పడి హత్య చేసుకునే వరకు వెళ్లింది. వినడానికి విచిత్రంగా ఉన్న నిందితుడు తుపాకీతో కాల్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. అతను ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండటం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను వాకింగ్కి తీసుకెళ్లాడు. అతని పొరుగింటి శునకం దాన్ని చూసి అరివడంతో ఇద్దరు యజమానుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు గమనించి ఇరువురిని శాంతింపజేయాలని ప్రయత్నించారు.
కానీ వివాదం సద్దుమనగకపోగా ఇంకా పెరిగింది. కోపోద్రిక్తుడైన ఓ యజమాని తన ఇంటి ఫస్ట్ఫ్లోర్కి వెళ్లి ఓ తుపాకీతో బయటకి వచ్చాడు. తనతో గొడవ పడిన వ్యక్తిపై తుపాకీతో కాల్చాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నిందితుడు రాజ్పాల్ రజావత్ ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తన సర్వీస్ గన్తో ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.