
- కలెక్టరేట్ లో రైతులు, అధికారులతో ముసాయి కమిటీ సమావేశం
ఆదిలాబాద్, వెలుగు : రైతులకు మేలు చేసేందుకే నూతన విత్తన చట్టాన్ని తీసుకొస్తున్నట్లు విత్తనాభివృద్ధి సంస్థ, చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. సమగ్ర విత్తన చట్టం 2025 ముసాయిదా తయారీ కోసం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చింది. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో సమావేశమై సలహాలు, సూచనలు చేశారు.
పాత చట్టంలోని సమస్యలను తెలియజేస్తూ కొత్త చట్టంలో ఉండాల్సిన నిబంధనలపై కమిటీ సభ్యులకు అభిప్రాయాలు తెలియజేశారు. అన్వేష్రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సూచనలు తీసుకొని కొత్త విత్తన చట్టాన్ని రూపకల్పన చేసి అమల్లోకి తీసుకొస్తామ న్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో కమిటీ సభ్యుడు దొంతి నర్సింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ శైలజ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి సుధాకర్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, రైతులు సంఘాల నేతలు పాల్గొన్నారు.
కమిటీ ముందు ఉంచిన సూచనలివే
-
మార్కెటింగ్ వ్యవస్థను కట్టడి చేసేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చాలి. రైతులకు తర్వగా నష్ట పరిహారం అందేలా చూడాలి. నష్ట పరిహారం కోసం కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేయాలి.
-
కొన్న విత్తనాలు 90 శాతం మొలకెత్తేలా చూసుకోవాలి. విత్తనం మొలకెత్తడంలో, విత్తన పనితీరులో వైఫల్యం ఉంటే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-
నకిలీ విత్తనాల వ్యాపారం చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేలా, జైలు శిక్షలు పడేలా నిబంధనలు రూపొందించాలి.