
- డీపీఎస్ స్కూల్ లో ఘనంగా సీతారామ కల్యాణ మహోత్సవం
- నిర్వాహకులు కొమరయ్య దంపతులకు అభినందనలు
ఉప్పల్,వెలుగు : వినయాన్ని, ధర్మాన్ని నేర్పే విధంగా చదువు ఉండాలని.. అది రాముడిని చూసి నేర్చకోవాలని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. నేడు విద్యాలయాలు గర్వాన్ని పెంచే విధంగా నడుస్తున్నాయని, అది తగ్గించి ధార్మిక విద్యను బోధించేలా డీపీఎస్ కొనసాగించాలని సూచించారు.
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్ )లో విద్యా సంస్థల చైర్మన్ కొమరయ్య, పల్లవి దంపతులు శనివారం ఘనంగా నిర్వహించిన సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన జీయర్ స్వామి మాట్లాడారు. ఈ ఏడాదిలో జనవరి నెల చాలా పవిత్రమైనదని, ఎందుకంటే.. 500 ఏళ్ల తర్వాత రాముడు తన స్థానానికి చేరుకోబోతున్నాడని గుర్తుచేశారు. రామాయణ వృత్తాంతాన్ని, రాముడి గుణగణాల నుంచి రామాయణంలోని ప్రముఖ ఘట్టాల వరకు ఆయన భక్తులకు బోధించారు.
ఇంతటి గొప్ప వేదికను ఏర్పాటు చేసిన కొమరయ్య, పల్లవి దంపతులు ధన్యులు అని అభినందించారు. రాముడి ఆశీస్సులు డీపీఎస్, పల్లవి స్కూల్స్ లోని విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని దీవించారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు ముచ్చింతల్ లోని సమతా మూర్తి రెండో వార్షికోత్సవం జరుగుతుందని,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీఈఓ మల్కా యశస్వి ,నాచారం ఎస్ హెచ్ఓ ఎం.ప్రభాకర్ పాల్గొన్నారు. 12 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు.