
- అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస
- కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురి సంతాపం
కోల్బెల్ట్/మందమర్రి, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్జర్నలిస్టు ఎండీ మునీర్(60) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మునీర్ పార్థివదేహాన్ని ఆదివారం మంచిర్యాలలోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేరుకుని మునీర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల కోసం మునీర్ సొంతూరు మందమర్రికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తుండగా వంశీకృష్ణ పాడె మోశారు. మందమర్రిలోని ఖబరస్థాన్లో మునీర్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. కాగా, మునీర్కు భార్య కళావతి, కూతుళ్లు ముజిబా, రేష్మా, తనుజ, కుమారుడు మయూర్ఖాన్ ఉన్నారు.
చిన్నప్పటి నుంచే ఉద్యమబాట..
సింగరేణి నేపథ్యమున్న మునీర్కుటుంబం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో స్థిరపడింది. ఆయన విద్యార్థి దశ నుంచే బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్యమించారు. బొగ్గు కాంటా వద్ద రౌడీలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కార్మికులను వేధిస్తే తిరుగుబాటు చేశారు. సింగరేణి కోల్బెల్ట్ప్రాంతంలో భూస్వాములు, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. కార్మికవాడల్లో సారా దుకాణాలను ఎత్తివేయాలని స్థానికులతో కలిసి ఉద్యమించారు. కమ్యూనిజం భావాలు కలిగిన మునీర్.. మొదటి నుంచి సీపీఐ, దాని అనుబంధ సంఘాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాల పాటు ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేసి హక్కుల నేతగా గుర్తింపు పొందారు. మందమర్రి ఏరియాలోని కల్యాణి ఖని-2,5 బొగ్గు గనుల్లో క్లర్క్గా పని చేసి వీఆర్ఎస్తీసుకున్నారు.
సింగరేణిలో ఓపెన్కాస్ట్మైన్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేశారు. జర్నలిస్టు సంఘాల లీడర్గా ఎన్నో ఉద్యమాలకు న్యాయకత్వం వహించారు. తెలంగాణ కోసం జరిగిన సకలజనుల సమ్మెను సింగరేణి జేఏసీ చైర్మన్గా మునీర్ముందుండి నడిపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్టు అవార్డుతో మునీర్ను సత్కరించింది. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వంటి పత్రికల్లో పని చేసిన ఆయన.. వెలుగు సహా పలు దినపత్రికల్లో సామాజిక అంశాలు, సింగరేణి కార్మిక రంగ సమస్యలపై వ్యాసాలు రాశారు. కార్మిక, విప్లవ సంఘాలతో కలిసి పని చేసిన మునీర్ నిర్భంధాలను ఎదుర్కొన్నారు.
కొద్దికాలం జైలు జీవితం కూడా గడిపారు.
ప్రముఖల సంతాపం...
మునీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ మావోయిస్టు హుస్సేన్ తదితరులు సంతాపం తెలిపారు. మునీర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సింగరేణి కార్మిక వర్గానికి తీరని లోటు: వివేక్ వెంకటస్వామి
సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ మృతి సింగరేణి కార్మికవర్గానికి తీరని లోటని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన ఆదివారం రాత్రి మంచిర్యాలలోని మునీర్ ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘కాకా వెంకటస్వామి కాలం నుంచి మా కుటుంబానికి మునీర్తో మంచి అనుబంధం ఉంది. జర్నలిస్టుగా సింగరేణి కార్మికుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కారం కోసం మునీర్ ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. ఎప్పుడూ కార్మికులు, ప్రజల్లో ఉంటూ వృత్తిపై నిబద్ధతతో పని చేశారు” అని చెప్పారు. మునీర్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
జీవితాంతం హక్కుల కోసం పోరాడారు: వంశీకృష్ణ
సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ తన జీవితాంతం హక్కుల కోసం పోరాడారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొనియాడారు. పత్రికా రంగంలో ఆయన చూపిన నిబద్ధత, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ‘‘మునీర్ అకాల మరణం ఎంతో బాధాకరం. కాకా వెంకటస్వామికి ఆయన అంటే ఎంతో ఇష్టం. మా కుటుంబంతో మునీర్కు 30 ఏండ్ల అనుబంధం ఉంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ మంత్రిగా ఉన్నప్పుడు చెన్నూరు అభివృద్ధి కోసం అనేక సలహాలు ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి పోరాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునీర్తో నేను చాలా సమయం గడిపాను. నాకు ఒక మెంటర్గా ఉంటూ సలహాలు ఇచ్చారు. ఆయన మృతి సింగరేణి కార్మికులకు తీరని లోటు” అని అన్నారు. మునీర్ తన జీవితాంతం ప్రజల హక్కులు, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమాలు చేశారని చెప్పారు.