
- 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ముంబై: ఓటాన్అకౌంట్ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల నుంచి పెద్దగా ఎటువంటి ప్రకటనలు లేకపోవడంతో మార్కెట్లలో కొంత నిరుత్సాహం కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ కొద్దిపాటి నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ప్రారంభ లాభాలను కోల్పోయిన తర్వాత, మధ్యంతర బడ్జెట్ను సమర్పించే సమయంలో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి.
బడ్జెట్లో మూలధన వ్యయం స్వల్పంగా పెరిగినా, పెద్ద ప్రకటనలు లేవు. సెన్సెక్స్ 107 పాయింట్లు క్షీణించి 71,645.30 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్టంగా 72,151.02లకు చేరింది. నిఫ్టీ 28.25 పాయింట్లు క్షీణించి 21,697.45 వద్దకు చేరుకుంది. ఇంట్రాడేలో గరిష్ట స్థాయి 21,832.95 కనిష్ట స్థాయి 21,658.75 మధ్య ఊగిసలాడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మార్చిలో వడ్డీ రేట్లను తగ్గించబోమని పేర్కొనడంతో మార్కెట్ సెంటిమెంట్ కూడా మందగించింది.
వివాదాస్పద చిన్న పన్ను డిమాండ్ల నుండి సామాన్యులకు ఉపశమనం కలిగించే సంస్కరణలను కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని 11 శాతం పెంచారు. కార్పొరేట్లకు ఆదాయపు పన్ను రేట్లు, కస్టమ్స్ డ్యూటీలో ఎటువంటి మార్పులను ప్రతిపాదించలేదు. 2024–-25లో మూలధన వ్యయాన్ని రూ. 11.11 లక్షల కోట్లకు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును 5.8 శాతానికి తగ్గించారు. తదుపరి ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గించారు.
సెన్సెక్స్ కంపెనీల పెర్ఫామెన్స్ ఇలా...
సెన్సెక్స్ సంస్థలలో, లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టెక్ మహీంద్రా నెస్లే షేర్లు నష్టాలపాలయ్యాయి. మారుతీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.40 శాతం క్షీణించగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం పడింది. సూచీలలో టెలికమ్యూనికేషన్ 1.55 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.12 శాతం, రియాల్టీ 1.05 శాతం, మెటల్ 0.99 శాతం, కమోడిటీలు 0.91 శాతం, ఇండస్ట్రియల్స్ 0.91 శాతం తగ్గాయి. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, యుటిలిటీస్ సర్వీసెస్ లాభపడిన వాటిలో ఉన్నాయి.