- ఒక శాతం మేర నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: ఆర్బీఐ ఎంపీసీ పాలసీ ప్రకటన వచ్చాక సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతం మేర నష్టపోయాయి. వడ్డీ రేట్లను ఇప్పటిలో తగ్గించమనే సంకేతాలను ఇవ్వడంతో గురువారం సెషన్లో ఫైనాన్షియల్, బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 724 పాయింట్లు (1 శాతం) తగ్గి 71,428 దగ్గర, నిఫ్టీ 213 పాయింట్లు పడి 21,718 దగ్గర సెటిలయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, రియల్టీ షేర్లు గురువారం భారీగా పడ్డాయి.
ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల నుంచి మార్కెట్కు కొంత సపోర్ట్ లభించింది. సెన్సెక్స్లో ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్, పవర్గ్రిడ్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం పడగా, మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది. సెక్టార్ల పరంగా చూస్తే ఎఫ్ఎంసీజీ 2 శాతం క్రాష్ అయ్యింది. బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కమొడిటీస్, ఆటో, రియల్టీ ఇండెక్స్లు ఒకటిన్నర శాతం వరకు పడ్డాయి. ఎనర్జీ, ఐటీ యుటిలిటీ, టెక్ ఇండెక్స్లు పాజిటివ్గా క్లోజయ్యాయి.