- ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుండడంతో పెరుగుతున్న అనిశ్చితి
- రూ.7.6 లక్షల కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు గురువారం సెషన్లో భారీగా పడ్డాయి. ఎలక్షన్స్ రిజల్ట్స్పై అనిశ్చితి పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ గత కొన్ని సెషన్లుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం సెషన్లో సెన్సెక్స్ 1,062 పాయింట్లు (1.44 శాతం) నష్టపోయి 72,404 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 345 పాయింట్లు పడి 21,956 దగ్గర సెటిలయ్యింది. లోక్ సభ ఎన్నికల్లోని మొదటి మూడు దశల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ‘బీజేపీ వరుసగా మూడోసారి పవర్లోకి వస్తుంది. కానీ 400 సీట్లు రాకపోవచ్చు అనే అంచనాలు దలాల్ స్ట్రీట్లో పెరిగాయి.
ఫలితంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్కు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికర అమ్మకందారులుగా మారడం, ఇండియన్ మార్కెట్ల వాల్యుయేషన్స్ హై లెవెల్లో ఉండడం, ఫెడ్ రేట్ల కోతపై అనిశ్చితి, కార్పొరేట్ రిజల్ట్స్ మెప్పించకపోవడం, జియో పొలిటికల్ టెన్షన్లు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లను కిందకి లాగుతున్నాయి. ఇన్వెస్టర్లు గురువారం ఒక్క సెషన్లో రూ.7.6 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 393 లక్షల కోట్లకు తగ్గింది.
మార్కెట్ పతనానికి కారణాలు..
1) లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా నమోదవుతుండడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిందని, రానున్న దశల్లో కూడా ఓటింగ్ తగ్గితే బెంచ్మార్క్ ఇండెక్స్లు మరింత పడే అవకాశం ఉందని ఫిలిప్ క్యాపిటల్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. అధికారంలోకి వచ్చినా, ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు రాకపోవచ్చని అంచనా వేసింది. ఒకవేళ ఈ నెంబర్ దాటి సీట్లు వస్తే మార్కెట్ ర్యాలీ చూడొచ్చని, 300–330 మధ్య వస్తే మార్కెట్ భారీగా పడుతుందని తెలిపింది. మార్కెట్ పడితే క్వాలిటీ షేర్లు కొనుక్కోవాలని సలహా ఇచ్చింది.
2) ఎఫ్ఐఐలు బుధవారం సెషన్లో నికరంగా రూ. 6,600 కోట్ల విలువైన షేర్లను అమ్మేయగా, గురువారం మరో రూ.7 వేల కోట్ల షేర్లను విక్రయించారు. మరోవైపు డీఐఐలు ఇదే స్థాయిలో షేర్లను కొంటూ మార్కెట్ మరింత పడకుండా చూస్తున్నారు. యూఎస్ బాండ్ ఈల్డ్లు పెరగడంతో ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా మారారు. మరోవైపు
ఇండియన్ ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే చైనా, హాంకాంగ్ మార్కెట్లు చౌకగా ఉండడంతో కూడా మన మార్కెట్ల నుంచి ఫండ్స్ తీసేస్తున్నారు. హాంకాంగ్ మార్కెట్ గత నెలలో 2.62 శాతం పెరగగా,
చైనా మార్కెట్ 8.8 శాతం పెరిగింది. ఇదే టైమ్లో నిఫ్టీ 1.5 శాతం పడింది.
3) కంపెనీల మార్చి క్వార్టర్ రిజల్ట్స్ మార్కెట్ను మెప్పించలేకపోతున్నాయి.
4) ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆందోళనలు పెరిగాయి. ఇన్ఫ్లేషన్ ఇంకా కంఫర్ట్ లెవెల్స్ కంటే పైన ఉండడంతో రేట్ల కోత ఆలస్యమవుతోంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మార్కెట్పై నెగెటివ్ ప్రభావం చూపుతున్నాయి.